TDP Janasena Alliance : ఏపీలో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించాయి.ఇప్పటికే ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలి? ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి? అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఏపీ కంటే ముందే తెలంగాణలో ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే జనసేన 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. మరి తెలంగాణలో కూడా టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయా? ఏపీలో లాగానే తెలంగాణలో కూడా ఉమ్మడిగా పోటీ చేస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంపై ఇరు పార్టీలు ఓ నిర్ణయం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ ఎన్నికలపై ఇప్పటికే టీటీడీపీ నేతలు బాలకృష్ణ నేతృత్వంలో విస్తృత చర్చలు జరుపుతున్నారు. అయితే పొత్తుల అంశాన్ని ఎన్నికలపై ఫోకస్ చేయాలని బాలకృష్ణ నేతలకు దిశానిర్దేశం చేశారు. జనసేనతో కలిసి నడిచే అంశంపై ఇప్పటికే పవన్తో చర్చించేందుకు బాలకృష్ణ సిద్ధమయ్యారని తెలుస్తోంది. త్వరలోనే ఈ భేటీ జరుగుతుందని ఆ తర్వాత ఇరు పార్టీల పొత్తుపై ఓ క్లారిటీ వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక జనసేన పొటీ చేసే అనేక స్థానాల్లో సెటిలర్లు ఎక్కువగా ఉన్నారని క్లియర్ కట్గా తెలుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మంలో ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఈ స్థానాల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీకి వెళ్తే.. కొన్ని సీట్లు వారి ఖాతాల్లో పడటం ఖాయమన్న ప్రచారం జోరుగా కొనసాగుతోంది.
అయితే ఇప్పటికే 32 స్థానాలను జనసేన ప్రకటించేసింది.జనసేన ప్రకటించిన కొన్ని స్థానాల్లో టీడీపీ కూడా బరిలోకి దిగాలని చూస్తోంది. ముఖ్యంగా కూకట్పల్లి, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, ఖమ్మం, కోదాడ, సత్తుపల్లి ఇతర నియోజకవర్గాల్లో తమ ప్రాబల్యం ఎక్కువగా ఉందనేది టీడీపీ నేతల ఆలోచన. ఇప్పటికీ ఈ నియోజకవర్గాల్లో టీడీపీకి ఇంకా కొంత ఓటు బ్యాంకు ఉందని, సీట్లు గెలవకపోతే కొంత ఓట్లు రాబట్టుకోవాలని భావిస్తోంది. మరి బాలకృష్ణ, పవన్ దీనిపై ఎలా ముందుకు వెళతారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.