మన దాయాది దేశం పాకిస్థాన్ లో క్రికెట్ ఫీవర్ ఎక్కువే. తొలి 4 వరల్డ్ కప్ టోర్నిల్లో మూడుసార్లు.. 1979,1983,1987లో ఆ జట్టు సెమీస్ కు చేరింది. పాక్ వన్డే ప్రపంచ కప్ కలను ఇమ్రాన్ ఖాన్ నెరవేర్చాడు. అతడి కెప్టెన్సీలో 1992 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది పాక్. ఆ తర్వాత ఒక్కసారి మాత్రమే ఫైనల్ కు చేరుకుంది. 1999 ప్రపంచ కప్ తుదిపోరులో ఆస్ట్రేలియాలో చేతిలో ఘోరంగా ఓడింది. ఆ తర్వాత మళ్లీ ఫైనల్ కు చేరలేదు పాక్.
వన్డే మెగా టోర్నిలో ఇప్పటి వరకు భారత్ పై ఒక్క విజయాన్ని కూడా సాధించలేకపోయింది పాక్. వరల్డ్ కప్ లో దాయాదుల పోరులో టీమిండియాదే పైచేయి. మ్యాచ్ కు ముందు ఎంత ఉత్కంఠ ఉన్నా.. మైదానంలో మాత్రం టీమిండియాదే హవా. అన్నీ మ్యాచ్ లను పాక్ పై భారత్ సునాయాసంగానే గెలిచింది. తొలి 4 వరల్డ్ కప్ ల్లో ఇరు జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉండటంతో లీగ్ దశలో తలపడలేదు. అలాగే 1983, 1987 టోర్నిల్లో భారత్ , పాక్ సెమీస్ కు చేరాయి కానీ ప్రత్యర్థులుగా పోటీ పడలేదు.
1992 ప్రపంచ కప్ లో తొలిసారి భారత్- పాక్ నేరుగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ పై ఓడినా.. ఆ తర్వాత అద్భుత ప్రదర్శనతో వరల్డ్ కప్ ను పాక్ ముద్దాడింది. 1996లో భారత్- పాక్ జట్లు క్వార్టర్స్ లో తలపడ్డాయి. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లోనూ టీమిండియానే విజయం వరించింది. ఆ మ్యాచ్ లో అమీర్ సొహైల్ వికెట్ తీసి మ్యాచ్ ను మలుపుతిప్పిన వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్ విన్యాసాలు ఇప్పటికే భారత్ క్రికెట్ ఫ్యాన్స్ కు మధుర జ్ఞాపకాలుగానే ఉన్నాయి.
1999 వరల్డ్ కప్ లో మూడోసారి పాక్ ను భారత్ ఓడించింది. ఈ సారి కూడా పేసర్ వెంకటేశ్ ప్రసాద్ 5 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2003 వరల్డ్ కప్ లో భారత్ -పాక్ మధ్య పోరు వరల్డ్ కప్ చరిత్రలో ఓ గొప్ప మ్యాచ్ లా సాగింది. శివరాత్రి రోజు పాక్ కు భారత్ జట్టు కాళరాత్రి చూపించింది. సచిన్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన , ద్రవిడ్ , యువరాజ్ మెరుపులతో టీమిండియా ఘన విజయం సాధించింది. 2007 వరల్డ్ కప్ లో భారత్ తొలి రౌండ్ లోనే ఇంటిముఖం పట్టడంతో పాక్ తో పోరు జరగలేదు.
2011 వరల్డ్ కప్ సెమీస్ లో పాక్ ను ఓడించి భారత్ ఫైనల్ కు దూసుకెళ్లింది. 2015 లో విరాట్ కోహ్లీ సెంచరీ, శిఖర్ ధావన్ మెరుపులు, షమీ బౌలింగ్ విన్యాసాలతో భారత్ మరోసారి మెగాటోర్నిలో పాక్ కు షాకిచ్చింది. 2019 ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ భారీ సెంచరీ సాధించడంతో దాయాది జట్టను టీమిండియా చిత్తు చేసింది. ఇలా వన్డే మెగా టోర్నిల్లో ఇరుజట్లు 7 సార్లు తలపడగా ప్రతి మ్యాచ్ లోనూ టీమిండియానే గెలిచింది.
వసీం అక్రమ్, వకార్ యూనిస్, సోయబ్ అక్తర్ లాంటి భీకరమైన పేస్ బౌలర్లను వరల్డ్ కప్ లో భారత్ బ్యాటర్లు చీల్చి చెండాడారు. ముస్తాక్ అహ్మద్, సక్లాయిన్ ముస్తాక్ లాంటి మేటి స్పిన్నర్లను చితకకొట్టేశారు. వరల్డ్ కప్ లో భారత్ బ్యాటర్లు పాక్ పై ప్రతి మ్యాచ్ లోనూ సింహగర్జనే చేశారు. బౌలర్లు అదే స్థాయిలో రాణించి మరుపురాని విజయాలను అందించారు. ఇప్పటికీ వన్డే వరల్డ్ కప్ లో భారత్ పై విజయం పాక్ కు కలగానే మిగిలింది.