Election Commission : తెలంగాణలో 2022-23 ఏడాదిలో 22 లక్షలకుపైగా ఓట్లను పరిశీలించి తొలగించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. శాసనసభ ఎన్నికల సన్నాహకాలపై సమీక్ష కోసం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన నేటితో ముగిసింది.
తెలంగాణలో స్త్రీ, పురుష ఓటర్లు దాదాపు సమానంగా ఉండటం శుభపరిణామని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలను ఓటింగ్లో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఈసారి యువ ఓటర్ల సంఖ్య 8 లక్షలు దాటడం ప్రశంసనీయమన్నారు. రాష్ట్రంలో 2022-23 ఏడాదిలో ఓటర్ లిస్టులో 22 లక్షలకుపైగా నకిలీ, చనిపోయిన ఓటర్లను పరిశీలించి తొలగించామన్నారు. ఎక్కడా ఏకపక్షంగా ఓట్లను తొలగించలేదన్నారు. ఫామ్ అందిన తర్వాతే తొలగించామన్నారు. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యామని రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావంపై కొన్ని పార్టీలు ఆందోళన వెలిబుచ్చాయన్నారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరగొచ్చని కొన్ని పార్టీలు ఆందోళన చెందాయన్నారు. బుధవారం ఓటర్ల తుది జాబితా కూడా వెల్లడించామని రాజీవ్ కుమార్ తెలిపారు.
జులై తర్వాత దరఖాస్తు చేసుకున్న 2.21 లక్షల యువతకు ఓటు హక్కు కల్పించామని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. 66 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారన్నారు. 18 నుంచి 19 ఏళ్ల యువ మహిళా ఓటర్లు 3.45 లక్షల మంది ఉన్నారన్నారు. తెలంగాణలో తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేషన్లు 35,356 ఉండగా.. ఒక్కో పోలింగ్ స్టేషన్లో సగటు ఓటర్ల సంఖ్య 897గా ఉందన్నారు. ఫిర్యాదుల స్వీకరణ కోసం సీ విజిల్ యాప్ను అందుబాటులోకి తెచ్చామని రాజీవ్కుమార్ వివరించారు.