Jogi Ramesh Comments : పెడన సభలో తనపై రాళ్లదాడికి కుట్ర చేశారంటూ అసత్య ఆరోపణలు చేసి.. పవన్ కల్యాణ్ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ అధికార పార్టీపై చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. పెడనలో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. టీడీపీ – జనసేన కలిసినా కూడా కనీసం 2 వేలమందిని కూడా తెచ్చుకోలేకపోయారని అన్నారు. పెడన ప్రజలను రౌడీలు అన్నందుకు పవన్ వారందరికీ క్షమాపణలు చెప్పాలని మంత్రి జోగి రమేష్ డిమాండ్ చేశారు.
టీడీపీ-జనసేనల కలయిక వ్యాధిని తగ్గించే వ్యాక్సిన్ కాదని, వాళ్లిద్దరూ కలిస్తే వైరస్ కన్నా ప్రమాదమని దుయ్యబట్టారు. ఇరుపార్టీలు పొత్తు ప్రకటించిన తర్వాత పవన్ మరింత దిగజారిపోయారని విమర్శించారు. గత ఎన్నికల్లో రెండు ప్రాంతాల నుంచి పోటీ చేసి.. రెండుచోట్ల ఓడిపోయినా పవన్ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడన్నారు. పవన్ కు సిగ్గు, మనస్సాక్షి ఏమాత్రం లేవన్నారు. అత్తారింటికి దారేది సినిమా పైరసీ ఎక్కడో జరిగితే.. పెడన కలంకారీ తమ్ముళ్లను పవన్ కొట్టించారని ఆరోపించారు. సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే కలంకారీ కళాకారులను గౌరవించి సత్కరించిందని గుర్తుచేశారు.
గతంలో పవన్.. చంద్రబాబు పాలన అవినీతి రాజ్యమని మాట్లాడారని, టీడీపీ ప్రజాద్రోహి పార్టీ అని అన్న మాటల్ని జోగి రమేష్ ప్రస్తావించారు. టీడీపీ వారు ఇప్పటికైనా తమ మైండ్ సెట్ ను మార్చుకోవాలని సూచించారు. చంద్రబాబు – పవన్ ల కలయిక ఒక విషబీజమని వారి వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. 2024 తర్వాత పవన్ తో తాను కూడా సినిమాలు తీస్తానంటూ వాటి టైటిల్స్ కూడా చెప్పారు. జానీ – కూలీ, గబ్బర్ సింగ్ – రబ్బర్ సింగ్ పేరుతో సినిమాలు తీస్తానని మంత్రి పేర్కొన్నారు.