Head Constable Family Deaths : కడపలో ఓ హెడ్ కానిస్టేబుల్ కుటుంబాన్ని కాల్చి చంపి.. అనంతరం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. మంచి కుటుంబం..బంగారం లాంటి ఇద్దరు ఆడపిల్లలు. అంతకు మించి పోలీస్ ఠాణాలో హెడ్కానిస్టేబుల్ ఉద్యోగం. ప్రశాంతంగా గడిచిపోతున్న వారిని చూసి విధికే కన్నుకుట్టిందేమో. సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో ఊహించని విపత్తు వచ్చి.. వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఒకే ఇంట్లో కుటుంబంమంతా రక్తపుమడుగులో చెల్లాచెదురుగా కనిపించడంతో బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంత కష్టమొచ్చిందో ఏంటో.. ఇంతటి దారుణానికి పాల్పడ్డారంటూనే.. కన్నీటిపర్యంతమవుతున్నారు. రోజూ తమతో ఉండే వ్యక్తి, అల్లరి చేస్తూ.. ఆడుతూ, పాడుతూ తిరిగే పిల్లలు, ఆప్యాయంగా పలుకరించే ఆ ఇల్లాలు ఇలా ఆకస్మాత్తుగా చనిపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కడప కో-ఆపరేటివ్ కాలనీలో వెంకటేశ్వర్లు (50) తన మొదటి భార్య, ఇద్దరు కూతుర్లతో నివాసం ఉంటున్నాడు. స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్లో వెంకటేశ్వర్లు విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి విధులు ముగిసిన అనంతరం.. ఇంటికి వెళ్తూ స్టేషన్లో ఉన్న సర్వీస్ రివాల్వర్ ను వెంకటేశ్వర్లు తన వెంట తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లాక పిల్లలు, భార్యపై కాల్పులు జరిపి హతమార్చాడు. అనంతరం తనను తాను కాల్చుకుని వెంకటేశ్వర్లు బలవన్మరణం చెందాడు. సమాచారం అందుకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జిల్లా ఎస్పీకి రూ.10 స్టాంప్ పేపర్ పై జిల్లా ఎస్పీకి రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, ఎర్రముక్కపల్లి ఎస్ బీఐ మేనేజర్కు హెడ్కానిస్టేబుల్ రాసిన లేఖలను చూసి అందరూ షాకయ్యారు. స్టాంప్ పేపర్లపై ఆయన రాసిన రాతలు చూసి పోలీసులే ఖంగుతిన్నారు. తన మరణాంతరం వచ్చే అన్నీ బెనిఫిట్స్ ను, బ్యాంకులో ఉన్న పర్సనల్ లోన్ తన రెండవ భార్య రమాదేవికి అందించాలని ఆ లేఖల్లో విజ్ఞప్తి చేశారు. ఇదంతా చూస్తుంటే..ఆస్తి కోసమే రెండో భార్య వెంకటేశ్వర్లును ఆత్మహత్యకు ప్రేరేపించి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా ప్రాంతంలో లభించిన ఆధారాలను సేకరించి, నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.