Sikkim Floods Update : ప్రకృతి ప్రకోపానికి ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం చిగురుటాకులా వణికిపోతోంది. ఆకస్మికంగా సంభవించిన వరద.. క్షణాల్లో ఊళ్లను తుడిచిపెట్టేసింది. వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మహా సముద్రాన్ని తలపించేలా అక్కడి నదులు ఉప్పొంగుతున్నాయి. చాలావరకూ రోడ్లన్నీ కొట్టుకుపోయి.. భయానక వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడికక్కడ భూమికి గుంతలు ఏర్పడ్డాయి. పెద్ద పెద్ద భవనాలు సైతం వరద తీవ్రతకు పునాదులతో సహా దెబ్బతిన్నాయి. చిన్న చిన్న ఇళ్ల పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరద మిగిల్చిన విషాదం, నష్టాల నుంచి బాధితులు ఇప్పుడప్పుడే కోలుకోవడం అసాధ్యమనే చెప్పాలి.
వరదల్లో ప్రజలకు సాయం చేయాల్సిన ఆర్మీ సిబ్బందే.. ఆ వరదల్లో గల్లంతవ్వడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. కుండపోత వర్షాలతో తీస్తా నదికి భారీగా వరద ఉద్ధృతి పెరిగింది. వరద ప్రభావం లాచెన్ లోయలోని ఆర్మీ శిబిరాలపై పడింది. వరదల్లో 23 మంది జవాన్లు గల్లంతయ్యారు. 41 వాహనాలు నీటమునిగాయి. జవాన్లు గల్లంతై 24 గంటలకు పైగానే అయినా ఇంతవరకూ వారి ఆచూకీ తెలియరాలేదు. అసలు జవాన్లు ఎక్కడైనా సురక్షితంగా ఉన్నారా? లేక అమరులయ్యారా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జవాన్ల ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మరోవైపు వరదల కారణంగా సిక్కింలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇంటర్నెట్ సదుపాయం కూడా సరిగా లేకపోవడంతో.. గల్లంతైన వారికోసం చేపట్టిన గాలింపు చర్యలు కష్టతరంగా మారాయి.
ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో తీస్తా నది నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. అదే సమయంలో చుంగ్థాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఫలితంగా దిగువ ప్రాంతంలో నీటిమట్టం 15-20 అడుగుల మేర పెరిగింది. దీంతో అర్ధరాత్రి ఒకటిన్నర ప్రాంతంలో ఈ మెరుపు వరదలు సంభవించాయి.తీస్తా నది ఉగ్రరూపానికి రాష్ట్ర రాజధాని గ్యాంగ్టక్కు 30 కిలోమీటర్ల దూరంలోని సింగ్తమ్ వద్ద ఉన్న స్టీల్ బ్రిడ్జి ఒకటి కొట్టుకుపోయింది. మరో 13 చోట్ల బ్రిడ్జిలు కూలిపోయాయి. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం.. సిక్కిం వరదల్లో 14 మంది మరణించగా 102 మంది గల్లంతయ్యారు.
అటు పశ్చిమ బెంగాల్లోనూ వరదలు చుట్టుముడుతున్నాయి. బెంగాల్, సిక్కింను కలిపే 10వ నంబర్ జాతీయ రహదారి చాలా చోట్ల దెబ్బతింది. వరదల నేపథ్యంలో మంగన్, గ్యాంగ్టక్, పాక్యోంగ్, నమ్చి జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 8 వరకు సెలవులు ప్రకటించినట్టు విద్యాశాఖ పేర్కొంది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం విద్యాసంస్థలకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. వర్షానికి గోడకూలి ఒకరు మృతి చెందగా.. 20 ఇళ్లు నేలమట్టమయ్యాయి.