Malaria Vaccine : చాప కింద నీరులా కబళించే వ్యాధి మలేరియా. 2021లో 24.7 కోట్ల కేసులు వెలుగుచూశాయి. ఆ ఏడాది మరణాలు ఆరులక్షలకుపైనే. మానవులను పీల్చి పిప్పి చేసే ఈ దోమకాటు వ్యాధికి రెండో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఆర్21/మ్యాట్రిక్స్-ఎం మలేరియా వ్యాక్సిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ.. WHO ఆమోద ముద్ర కూడా లభించింది.
ఆఫ్రికాలోని ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయొచ్చని డబ్ల్యూహెచ్వో తెలిపింది. యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్, సెరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి. తొలి వ్యాక్సిన్తో పోలిస్తే ఇది అతి చౌక. లభ్యతా ఎక్కువే. మరి ఇకనైనా మలేరియా కట్టడి సాధ్యమవుతుందా? అంటే కాకపోవచ్చనే అంటున్నారు నిపుణులు.
మలేరియా తొలి వ్యాక్సిన్ మస్కిరిక్స్ను డబ్లూహెచ్వో 2021లో ఆమోదించింది. జీఎస్కే ఫార్మా కంపెనీ అభివృద్ధి చేసిన ఆ వ్యాక్సిన్ ఎఫికసీ 30 శాతమే. పైగా నాలుగు డోసులు ఇవ్వాలి. అయినా మలేరియా నుంచి లభించే రక్షణ నెలల వ్యవధిలోనే మటుమాయం కావడం ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురి చేసింది. ఇప్పటి వరకు ఘనా, కెన్యా, మలావిలోని 17 లక్షల మంది చిన్నారులకు మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వగలిగారు. డిమాండ్కు తగ్గట్టుగా లభ్యత లేకపోవడమే ఇందుకు కారణం. ఏడాదికి 15 మిలియన్ డోసులను మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నారు.
ఇక తాజాగా ఆమోదం పొందిన ఆర్21 వ్యాక్సిన్ డోసులను పుణెలోని సెరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేయనుంది. ఏడాదికి 200 మిలియన్ల వరకు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయగలమని ఆ సంస్థ చెబుతోంది. వ్యాక్సిన్ సామర్థ్యం కూడా 75% అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సినాలజిస్ట్ అడ్రెయిన్ హిల్ వెల్లడించారు. రెండు వ్యాక్సిన్ల మధ్య ప్రధాన వ్యత్యాసం లభ్యత. మస్కిరిక్స్తో పోలిస్తే ఆర్21 టీకా లభ్యత ఎక్కువగా ఉంటుంది.
అయితే ఈ రెండు వ్యాక్సిన్లు మలేరియా వ్యాప్తిని సంపూర్ణంగా అరికట్టలేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇమ్యూనైజేషన్ ప్రక్రియతో సరిపెట్టుకోకుండా.. ఇతర చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మందులను సైతం తట్టుకుని నిలబడేలా మలేరియా పారసైట్, దోమలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
ఆర్21 వ్యాక్సిన్ ఇప్పట్లో భారత్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. హైరిస్క్ ఉన్న ఆఫ్రికా దేశాలకు మాత్రమే డోసుల పంపిణీ జరుగుతుంది. భారత్లో పలు ప్రాంతాల్లో మలేరియా బెడద ఎక్కువగానే ఉంది. జనాభాలో 95% మంది మలేరియా ఎండమిక్ ఏరియాల్లోనే నివసిస్తున్నారు. 20 శాతం జనాభా నివసించే గిరిజన, కొండ, మారుమూల ప్రాంతాల్లోనే 80 శాతం మలేరియా కేసులు నమోదమవుతున్నాయి. అయితే 2018-22 మధ్య మలేరియా కేసుల సంఖ్యను ప్రభుత్వం గణనీయంగా తగ్గించగలిగింది.