Bathukamma: భాద్రపదం మాసపు చివరిరోజు.. మహాలయ అమావాస్య. ఆ రోజు సాయంత్రం నుంచే ఎంగిలిపూల బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. పువ్వులనే దైవంగా భావించి, పూజించటం ఈ పండుగ ప్రత్యేకత. తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాల్లో బతుకమ్మని కొలిచి చివరి రోజు ఘనంగా నిమజ్జనం చేయటం ఈ పండుగ ప్రత్యేకత. కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన రాణీ రుద్రమదేవి తమ మనవలు అనారోగ్యం పాలైనప్పుడు బతుకమ్మ పండుగ జరిపించి, తన వంశాన్ని కాపాడమని స్వయంగా బతుకమ్మ ఆడిందని చెబుతారు. ఇలా వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ పండుగ ఆవిర్భావం వెనక పలు ఆసక్తికర కథనాలున్నాయి. అవి..
చోళరాజు ధర్మాంగదునికి వందమంది కుమారులు కలిగినా వారంతా యుద్ధంలో వీరమరణం పొందుతారు. చాలాకాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి ఆడపిల్ల పుడుతుంది. నిండు నూరేళ్లు బతుకమ్మా అని ఆ శిశువును అందరూ ఆశీర్వదిస్తారు. నాటినుంచి బతుకమ్మను లక్ష్మీ స్వరూపంగా పూలతో అలంకరించి పండుగ చేసుకోవడం ఆచారంగా మారింది.
ఇంకొక కథనం ప్రకారం.. ఒక గ్రామంలో ఏడుగురు అన్నదమ్ములకు ఓ ముద్దుల చెల్లి ఉండేది. ఆమె అంటే అన్నలకు ప్రాణమైనా వదినలకు మాత్రం అసూయ. ఓసారి అన్నలంతా వేటకెళ్లగా, ఇదే అదనుగా ఆ బాలికను వదినెలంతా వేధిస్తారు. దీంతో ఆ బాలిక ఇల్లొదిలి వెళ్లిపోయింది. వేటనుంచి తిరిగొచ్చిన అమె అన్నలు.. ఆమె కోసం తిరిగి తిరిగి వెతుకుతూ.. ఒక నేల బావిలో దిగి దప్పిక తీర్చుకుంటుండగా, పెద్ద తామరపూవు ఒకటి నీటిపై తేలుతూ వారి వద్దకు వచ్చి ఆగిందట. తమ చెల్లెలు ఆ పూవు రూపంలో వచ్చింది తమ చెల్లెలేనని భావించి ఆ పూవును తమ ఇంటికి తీసుకెళ్లారట. ఈ సంగతి తెలిసిన ఆ దేశపు రాజు వారి నుంచి బలవంతంగా ఆ పూవును తీసికెళ్లి తన కొలనులో వేయగా.. కొలను మొత్తం తంగేడు మొక్కలు మొలిచాయట. ఆ తామరే శ్రీలక్ష్మి అవతారంగా మిగిలిన పువ్వులకు బతుకుతెరువు చూపింది కాబట్టి బతుకమ్మగా పూజించడం మొదలుపెట్టారని చెబుతారు.
తొమ్మిది రోజుల యుద్ధంలో మహిషాసురుడిని చంపిన తర్వాత అమ్మవారు అలసిపోయి విశ్రాంతి తీసుకొందట. అనంతరం ఆమెను నిద్రలేపేందుకు మహిళలంతా ఆమెను స్తుతిస్తూ.. ఆమె చుట్టూ తిరుగుతూ ఆడిపాడారని మరో కథనం.