Revanth Reddy Comments : బీఆర్ఎస్ , బీజేపీ బంధంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని గుర్తుచేశారు. మంగళవారం నిజామాబాద్ సభలో ప్రసంగించిన మోదీ.. ఎన్డీయేలో చేరేందుకు కేసీఆర్ తనను కలిశారని చెప్పడంతో తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. నేడు మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్, బీజేపీ బంధాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ సలహా లేనిదే కేసీఆర్ ఏదీ చేయరని, ఆ రెండింటిదీ ఫెవికాల్ బంధమని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ను సీఎం చేస్తానంటూ ప్రధాని మోదీని సలహా అడిగిన విషయంపై కేసీఆర్ నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి.. కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలన్నదే మోదీ ప్రధాన ఉద్దేశమని ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని రేవంత్ ఆరోపించారు.
మోదీ, బీఆర్ఎస్ ఏకమైనపుడు ఎంఐఎం ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. దీనికి ఎంఐఎం వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ను గెలిపించేందుకే బీజేపీ పోటీ చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ఆదేశాల మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారని రేవంత్ రెడ్డి చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ల మధ్య పొత్తు కుదిరిందన్న రేవంత్.. బీఆర్ఎస్ 9 స్థానాల్లో, బీజేపీ 7 స్థానాల్లో, ఎంఐఎం ఒక్కస్థానంలో పోటీ చేసేలా ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. బీజేపీ 4 సిట్టింగ్ స్థానాలతో పాటు మల్కాజ్గిరి, మహబూబ్నగర్, చేవెళ్ల స్థానాలను బీజేపీ అడిగినట్లుగా.. బీఆర్ఎస్కు చెందిన ఓ ఎంపీ తనకు చెప్పినట్లు రేవంత్ వెల్లడించారు. తన సిట్టింగ్ స్థానం కూడా బీజేపీకి ఇస్తామని అంగీకరించారనే విషయాన్ని చెప్పి.. ఆ ఎంపీ నా వద్ద ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాకపోతే.. కేసీఆర్ అవినీతిపై కేంద్రం ఎందుకు విచారించడం లేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ దోపిడీలో మోదీకి కూడా వాటాలు వెళ్తున్నాయని, అందుకే కేసీఆర్పై మోదీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేసీఆర్ – మోదీది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అని.. అలాంటి వారికి అసదుద్దీన్ ఎలా మద్దతిస్తారో ఆలోచించుకోవాలని రేవంత్ సూచించారు. రెండుపార్టీల బండారం బయటపడిందనే.. కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని, ఇప్పుడు తమ పార్టీని ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న విషయాన్ని ఓటర్లు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఓటుతో బీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్తారని రేవంత్ తెలిపారు.