గుంటూరు జీజీహెచ్ లో ఆరు రోజుల శిశువు కిడ్నాప్ (GGH Baby Kidnap) అయింది. తల్లి పక్కలో ఉన్న పసిపాపను గుర్తు తెలియని మహిళ అపహరించుకుపోయింది. గుంటూరు ఐపీడీకి చెందిన రబ్బానీ భార్య రోషిని.. డెలివరీ నిమిత్తం సెప్టెంబర్ 26న జిజిహెచ్ లో జాయిన్ అయింది. 27న ఆమెకు సిజేరియన్ చేయగా పండంటి పాపకు జన్మనిచ్చింది. మంగళవారం మధ్యాహ్నం వరకూ పాప తల్లి పక్కనే ఉంది. తల్లి నిద్రించడాన్ని గమనించిన.. గుర్తు తెలియని మహిళ శిశువును తీసుకొని పోయింది.
పక్కలో శిశువు లేకపోవడాన్ని గమనించిన తల్లి..వెంటనే విషయాన్ని భర్తకు చెప్పింది. వెంటనే ఇద్దరూ కలిసి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు జిజిహెచ్ లో సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అందులో గుర్తు తెలియని మహిళ పసిపాపను తీసుకెళ్ళినట్లు గుర్తించారు. దాని ఆధారంగా పాపను ఎత్తుకెళ్లిన మహిళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ ను కనుగొన్నారు. నరసరావుపేట మండలం ఉప్పలపాడులో కిడ్నాపర్ ను గుర్తించి.. పసికందును తీసుకున్నారు. పాపను కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గతంలోనూ జీజీహెచ్లో పసిపిల్లల అపహరణ జరిగిన ఘటనలు ఉన్నాయి. ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను నియమించడంతో కొంతమేరకు శిశువుల అపహరణకు అడ్డుకట్ట పడింది. తాజాగా మరోసారి శిశువు అపహరణతో చిన్న పిల్లలపై భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవమాసాలు మోసి, ప్రవస వేదనను భరించి పిల్లల్ని కంటే.. కాసులకు కక్కుర్తిపడి పిల్లల్ని అపహరించి అమ్మేస్తున్నారు.
ఏపీలో చిన్నపిల్లల కిడ్నాప్ లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రెండురోజుల క్రితం తిరుపతి బస్టాండ్ లో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ స్థానికంగా కలకలం రేపింది. చెన్నై నుంచి వచ్చిన ఓ కుటుంబం శ్రీవారిని దర్శించుకుని తిరుగు పయనమయ్యేందుకు తిరుపతి బస్టాండ్ కు చేరుకున్నారు. అర్థరాత్రి సమయంలో బాలుడితో పాటు తల్లిదండ్రులు నిద్రపోగా.. ఓ వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్లాడు. కొడుకు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతని కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టగా.. నిందితుడి అక్క బాలుడిని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించింది. తన అక్కకు పిల్లలు లేరన్న కారణంగానే నిందితుడు బాలుడిని ఎత్తుకెళ్లి ఆమె ఇంటిలో వదిలిపెట్టినట్లు పోలీసులకు వివరించింది. అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.