ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో ఆకస్మిక వరదలు (Sikkim Flash Floods) సంభవించాయి. గత రాత్రి లోనాక్ సరస్సు వద్ద కురిసిన కుండపోత వర్షానికి లాచెన్ లోయలో గల తీస్తానది ఉప్పొంగడంతో ఆకస్మిక వరదలు వచ్చాయి. ఈ వరదల్లో 23 మంది జవాన్లు గల్లంతయ్యారని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. కుండపోత వర్షాల కారణంగా తీస్తానదికి వరద పోటెత్తింది. నది నీటిమట్టం ఒక్కసారిగా పెరగడం, అదే సమయంలో డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో అక్కడి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దిగువ ప్రాంతంలో నీటిమట్టం 15-20 అడుగుల మేర పెరగడంతో.. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో మెరుపు వరదలు సంభవించాయి.
వరదల తీవ్రతకు లాచెన్ లోయలోని ఆర్మీపోస్టులు నీట మునగగా.. సింగ్తమ్ లో ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఆ వాహనాలలో ఉన్న 23 మంది సిబ్బంది గల్లంతైనట్లు ఈస్ట్రన్ కమాండ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. గల్లంతైన సిబ్బంది కోసం గాలింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. 41 వాహనాలు నీటమునిగినట్లు తెలిపింది. వరదలు సంభవించిన ప్రాంతంలో ఇంటర్నెట్ సదుపాయం సరిగా లేకపోవడంతో అక్కడి ఆర్మీ సిబ్బందిని కమాండ్ స్థాయి అధికారులు సంప్రదించడం కష్టమైనట్లు సైనిక వర్గాలు తెలిపాయి.
కుండపోత వర్షాలతో తీస్తానది ఉగ్రరూపం దాల్చడంతో సింగ్తమ్ ఫూట్ బ్రిడ్జ్ కుప్పకూలింది. మరోవైపు పశ్చిమబెంగాల్, సిక్కింను కలిపే 10వ నంబర్ జాతీయ రహదారి చాలా చోట్ల కొట్టుకుపోయింది. ఆకస్మిక వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ పరిస్థితిపై స్పందించిన సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్.. సిక్కింలో వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి.. సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. తీస్తానది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
https://x.com/SM_8009/status/1709417978264199676?s=20