ఓటర్ల జాబితాల్లోని బోగస్ ఓట్లు అలానే ఉన్నాయని, దరఖాస్తులను ఇంకా పరిష్కరించకుండా తుది ఓటర్ల జాబితా ఎలా ప్రకటిస్తారని పలు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం వద్ద అసంతృప్తి వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతస్థాయి బృందం(Election Commission Visit) మంగళవారం రాష్ట్రానికి వచ్చింది. 3 రోజుల పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులతో విస్తృతస్థాయి మేధోమథనం చేయనుంది. తొలిరోజు ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా అధిక శాతం పార్టీలు ఓటర్ల జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి వినతి పత్రాలు ఇచ్చాయి. నామినేషన్ల దాఖలుకు మూడు రోజుల ముందు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఓటు హక్కు ఇవ్వాలని పలు పార్టీలు కేంద్ర ఎన్నికల బృందానికి సూచించాయి. రోడ్డు రోలర్ గుర్తును ఇతర పార్టీలకు కేటాయించకుండా తక్షణం నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ కోరింది.
హుజూరాబాద్, మునుగోడు ఉపఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులు చేసిన ఖర్చు ఊహకు అందనంతగా ఉందని.. డబ్బు విచ్చలవిడి వినియోగాన్ని నియంత్రించేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారని కాంగ్రెస్, సీపీఎం, బీఎస్పీ, ఆప్ పార్టీలు ప్రశ్నించాయి. బీఆర్ఎస్ అధికారులను తమకు కావాల్సిన చోటుకు బదిలీ చేసుకుందని ఫిర్యాదులు చేశాయి. శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక శాంతిభద్రతల అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ చెప్పారు. అభ్యర్థి ఎన్నికల వ్యయాన్ని మరో రూ.20 లక్షలు పెంచాలని చెప్పామన్నారు. ఎన్నికల షెడ్యూల్ పది రోజుల్లో వస్తుందనగా బీఆర్ఎస్ రోజుకో పథకం పేరుతో జీఓలు ఇవ్వడమంటే.. ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేయడమే అవుతుందన్నారు కాంగ్రెస్ నేతలు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. కొత్త ఓటర్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తిచేశాకే తుది ఓటర్ల జాబితా ప్రకటించాలన్నారు.
రెండోరోజు పర్యటన..
హైదరాబాద్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. తొలిరోజు రాజకీయ పార్టీలతో భేటీ అయిన సీఈసీ టీం.. ఇవాళ అధికారులతో సమావేశమైంది. సాయంత్రం 7 గంటల వరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలతో మీటింగ్ నిర్వహిస్తోంది. ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లు, నిఘాపై కేంద్ర ఎన్నికల బృందం ఆరా తీయనుంది. మద్యం, డబ్బు పంపిణీ, చెక్ పోస్టుల ఏర్పాటుపై పోలీసులతో చర్చించనుంది. ఓట్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు, ఫిర్యాదులు, గత అనుభవాలపై కేంద్ర ఎన్నికల బృందం జిల్లా ఎన్నికల అధికారులకు సూచనలు చేయనుంది.