తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని చెబుతున్న దళితబంధు పథకం లోగుట్టు ఇప్పుడు బయటపడినట్లైంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో తాజాగా ఓ మంత్రి ఫోన్ కాన్ఫరెన్స్(Errabelli Viral Audio)లో జరిగిన సంభాషణలు వింటే తెలుస్తుంది. దళితబంధుపై బీఆర్ఎస్ మంత్రులు పైకి చెబుతున్నది ఒకటి, తెరవెనుక చేస్తున్నది మరొకటి అన్నట్లుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. నిన్న హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. అర్హులందరికీ దళితబంధు ఇస్తామని చెప్పారు. కానీ వాస్తవంలో చూస్తే మాత్రం.. అందుకు విరుద్ధంగా జరుగుతోంది.
అర్హులందరికీ దళితబంధు ఇస్తామని మంత్రి కేటీఆర్ చెప్పి 24 గంటలైనా కాకుండానే.. అందరికీ ఇవ్వక్కర్లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చెప్పడం తీవ్ర దుమారం రేపుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారిక ఫోన్ కాన్ఫరెన్స్లో..దళితబంధు అందరికీ ఇవ్వక్కర్లేదన్నట్లుగా ఎర్రబెల్లి మాట్లాడారు. కాంట్రవర్సీ ఉన్న చోట మాత్రం లిస్ట్ తయారు చేస్తే చాలని.. అలా చేస్తే వాళ్లలో వాళ్లు తగాదాలు పెట్టుకుంటారని అన్నారు. లిస్ట్ తయారయ్యే సరికి ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుందని, కోడ్ వచ్చాక ప్రభుత్వ కార్యక్రమాలేవీ చేయాల్సిన అవసరం ఉండదన్నట్లుగా చెప్పారు. ఎర్రబెల్లి మాట్లాడిన ఈ మాటలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతలకే లబ్ధి జరిగేలా చూడాలన్నట్లుగా కూడా ఎర్రబెల్లి వ్యాఖ్యలు ఉన్నాయి. అధికారిక సమావేశంలో ఆయన ఓట్ల గురించి మాట్లాడటం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్లు కూడా హాజరైన కార్యక్రమంలో.. ఓట్ల కోసమే పనిచేయాలన్నట్లుగా వారికి సూచించడంపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఎర్రబెల్లి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
కాగా.. నిన్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. తనకోసం పనిచేసే వాళ్ళకే దళిత బంధు ఇస్తానని.. ఇంట్లో ఉన్నవాళ్లకు ఎందుకు ఇస్తానని బాహాటంగానే చెప్పడం విమర్శలకు దారితీసింది. పార్టీ కోసం పనిచేస్తేనే పథకాలు అందుతాయని చల్లా ధర్మారెడ్డి అక్కడే తేల్చేశారు. దామెరలో నిర్వహించిన దళిత బంధు లబ్ధిదారుల అవగాహన సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు చల్లా ధర్మారెడ్డి. అటు ఎర్రబెల్లి, ఇటు ధర్మారెడ్డి కామెంట్లు చూస్తుంటే.. దళితబంధుపై తెలంగాణ సర్కార్ కొత్త ఎత్తు వేసిందా? దళితబంధు అందరికీ ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎలక్షన్ కోడ్ను బూచిగా చూపి దళితబంధు పథకాన్ని అమలు చేయకూడదన్నదే ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.