ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్, కెనడా(India VS Canada) దేశాల మధ్య రేగిన చిచ్చు ఇప్పుడు రావణకాష్టంలా మారింది. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో ఉండగా.. భారత్ మాత్రం ఈ విషయంలో తగ్గేదే లే అంటోంది.ఇప్పటికే కెనడియన్లకు వీసాల జారీని నిలిపేసిన భారత్.. ఇప్పుడు భారత్లో ఉన్న 40 మంది దౌత్యవేత్తలను కెనడా వెనక్కి పిలిపించుకోవాలని అల్టిమేట్టం జారీ చేసింది. అది కూడా ఈ నెల 10లోగా దౌత్యవేత్తలంతా భారత్ను విడిచి వెళ్లాలని చెప్పింది. ఒకవేళ అక్టోబర్ 10 తర్వాత వారు భారత్ లో ఉంటే.. వారికి ఎలాంటి దౌత్యపరమైన రక్షణ ఉండదని తేల్చి చెప్పింది.
నిజానికి దౌత్య సిబ్బంది విషయంలో ఇరు దేశాలు సమాన సంఖ్యలో ఉండాలన్నది నిబంధన. కానీ కెనడాలో ఉన్న భారత దౌత్య సిబ్బందికి.. భారత్లో ఉన్న కెనడా సిబ్బందికి అస్సలు సంబంధం లేదని కేంద్రం చెబుతోంది. ప్రస్తుతం భారత్లో 62 మంది కెనడా దౌత్యవేత్తలు ఉండగా.. వారిలో 41 మందిని వెనక్కి పిలిపించాలని భారత ప్రభుత్వం కెనడాకు చెబుతోంది.
నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలతో ఈ దౌత్య వివాదం రాజుకుంది. ఆ తర్వాత కెనడాలో భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు పడింది. కెనడా చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్..కెనడా చర్యకు కౌంటర్గా కెనడా దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించింది.ఇప్పుడు ఏకంగా 40 మందిని వెనక్కి పిలుపించుకోవాలని తేల్చి చెప్పింది. భారత్ ఇచ్చిన అల్టిమేట్టంపై కెనడా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.