గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా తనపై పెట్టిన కేసు కొట్టివేయాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం… విచారణ చేపట్టింది. సుదీర్ఘ వాదనల అనంతరం తదుపరి విచారణను సుప్రీం ధర్మాసనం అక్టోబర్ 9, సోమవారానికి వాయిదా వేసింది. అంతకుముందు విచారణ సందర్భంగా సెక్షన్ 17ఏ పై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, అభిషేక్ సింఘ్వీ ల మధ్య సుధీర్ఘంగా వాదనలు జరిగాయి. తొలుత హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తూ.. సెక్షన్ 17A ను రాజకీయ ప్రతీకారం కోసమే తీసుకొచ్చారన్నారు. ఈ కేసులో ఆ సెక్షన్ వర్తిస్తుందా ? లేదా? అన్నదే ముఖ్యమని, ఆరోపణలు ఎప్పటివనేది ప్రధానం కాదన్నారు. కేసు నమోదు, విచారణ ఎప్పుడు అనేవే చర్చించాల్సిన అంశాలన్నారు.
అనంతరం అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ.. అవినీతి నిరోధక చట్టసవరణలో ప్రతి పదాన్ని సునిశితంగా పరిశీలించి నిర్థారించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలకు సీఎం ఒక్కరే బాధ్యులు కాలేరని, ఆ నిర్ణయాలు అధికార నిర్వహణలో భాగమేనని తెలిపారు. అధికార నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలపై ప్రతీకార చర్యల నుంచి సెక్షన్ 17A రక్షణ కల్పిస్తుందన్నారు. ట్రాప్ కేసు మినహా.. మిగతా 6 రకాల ఆరోపణలకు 17A వర్తిస్తుందన్నారు. 2015 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాలపై ఆరోపణలు ఉన్నాయన్నారు. సాల్వే , సింఘ్వీల వాదనలు విన్న ధర్మాసనం.. క్వాష్ పిటిషన్ పై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.