భారత్ లో క్రికెట్ ఓ మతం. దేశంలో ఏ ఇతర క్రీడకు ఇంతట ఆదరణ లేదు. భారత్ క్రికెట్ ప్రయాణం చాలా పేలవంగా ప్రారంభమైంది. 1975 తొలి వరల్డ్ కప్ లో భారత్ ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. పసికూన ఈస్ట్ ఆఫ్రికాపై మాత్రమే గెలిచింది. 1979 వరల్డ్ కప్ లో పరిస్థితి మరి దారుణం. భారత్ ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓడింది.
1983 వరల్డ్ కప్ లో భారత్ పసికూనగానే బరిలోకి దిగింది. వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లే హాట్ ఫేవరేట్లు. కానీ కపిల్ డెవిల్స్ సంచలన ప్రదర్శన చేసింది. అనూహ్యంగా ఫైనల్ కు దూసుకెళ్లింది. తుదిపోరులో విండీస్ ను చిత్తుచేసి టైటిల్ కైవసం చేసుకుంది కపిల్ టీమ్. ఈ విజయం భారత్ లో క్రికెట్ ఫీవర్ ను పెంచింది. అప్పటి నుంచి క్రికెట్ కు రోజురోజుకు ఆదరణ మరింత పెరిగింది. సునీల్ గావాస్కర్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇలా తరానికి ఓ స్టార్ తమ బ్యాటింగ్ విన్యాసాలతో క్రికెట్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నారు. కపిల్ దేవ్, గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని లాంటి కెప్టెన్లు భారత్ క్రికెట్ రూపురేఖలనే మార్చేశారు.
1983 వరల్డ్ కప్ ఛాంపియన్ గా నిలిచిన భారత్.. 1987లో సెమీస్ కు చేరింది. 1992 వరల్డ్ కప్ లో భారత్ ఆశించిన విధంగా రాణించలేదు. 1996 వన్డే మెగా టోర్నిలో మళ్లీ టీమిండియా సత్తా చాటింది. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగినా అనూహ్యంగా సెమీస్ లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. 1999లో వరల్డ్ కప్ లో భారత్ తడబడి సూపర్-6 స్టేజ్ లో ఇంటిముఖం పట్టింది.
2003 ప్రపంచ కప్ లో గంగూలీ సారధ్యంలోని టీమిండియా అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ మదిలో చెరగని ముద్ర వేసింది. ఆ మ్యాచ్ లో సచిన్, ద్రావిడ్, యువరాజ్ మెరుపులతో అద్భుత విజయం సాధించింది. ఈ మెగా టోర్నిలో ఫైనల్ కు చేరిన భారత్.. ఆసీస్ చేతిలో ఓడినా టోర్నిలో చేసిన అద్భుత ప్రదర్శన భారత్ క్రికెట్ కు కొత్త ఊపునిచ్చింది.
2007 వరల్డ్ కప్ లో ద్రావిడ్ నేతృత్యంలోని టీమిండియా అనూహ్యంలో తొలి రౌండ్ లోనే ఇంటికి వచ్చేసింది. పసికూన బెర్ముడాపై మాత్రమే గెలిచిన భారత్.. బంగ్లాదేశ్ , శ్రీలంక జట్ల చేతిలో ఓడి టోర్ని నుంచి నిష్క్రమించింది. 2011 వరల్డ్ కప్ లో భారత్ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. 28 ఏళ్ల తర్వాత మళ్లీ వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. క్రికెట్ గాడ్ సచిన్ ఆడిన చివరి వరల్డ్ కప్ లో భారత్ రెండోసారి టైటిల్ ను ముద్దాడింది. 2015 , 2019 వరల్డ్ కప్ టోర్నిలో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన టీమిండియా సెమీస్ లో ఓడిపోయింది. ఇంతవరకు ఒక్కసారి కూడా వన్డే వరల్డ్ కప్ లో భారత్ పై పాకిస్థాన్ గెలవలేదు. ఇలా ఎన్నో మరుపురాని విజయాలు వరల్డ్ కప్ భారత్ కు దక్కాయి.
ఇప్పటి వరకు భారత్ 3 సార్లు వరల్డ్ కప్ ఫైనల్ కు చేరింది. రెండుసార్లు విజేతగా నిలిచింది. 4 సార్లు సెమీస్ లో ఓడిపోయింది. స్వదేశంలో జరిగిన 3 వరల్డ్ కప్ టోర్నిల్లో భారత్ ఒకసారి విజేతగా నిలిచింది. మరో రెండుసార్లు సెమీస్ చేరుకుంది. ఇప్పుడు 4వ సారి భారత్ వరల్డ్ కప్ కు ఆతిధ్యం ఇస్తోంది. సెంటిమెంట్ ప్రకారం ఈసారి సెమీస్ చేరుతుందా..? టైటిల్ గెలుస్తుందా? గెలవాలన్నదే భారత్ క్రికెట్ అభిమానుల కోరిక.