తిరుపతిలో కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతమైంది. చిన్నారిని అపహరించిన వ్యక్తే.. స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి బాలుడిని అప్పగించటంతో చిన్నారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలుడు కిడ్నాపైన 10 గంటలలోనే పోలీసులు కేసును ఛేదించారు. నిందితుడిని తిరుపతి అవిలాలకు చెందిన సుధాకర్గా గుర్తించారు. తన అక్కకు పిల్లలు లేకపోవటంతో.. ఆమె బాధను చూడలేక సుధాకర్ ఈ బాలుడిని కిడ్నాప్ చేసి తన అక్కకు ఇచ్చాడు. సుధాకర్ బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటన సీసీ టీవీ కెమెరాలో రికార్డవ్వగా.. పోలీసులు దాని ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల గాలింపు చర్యలకు భయపడి..సుధాకర్, అక్క నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి బాలుడిని పోలీసులకు అప్పగించారు.
వివరాల్లోకి వెళ్తే.. చెన్నైకి చెందిన చంద్రశేఖర్ కుటుంబం శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చింది. స్వామివారి దర్శనం అనంతరం.. సొంత ఊరికి తిరిగి వెళ్లేందుకు చంద్రశేఖర్ కుటుంబం తిరుపతి బస్టాండ్కు వచ్చింది. ఆగే ప్లాట్ ఫారం నంబర్ 3 స్టాప్ దగ్గర సోమవారం రాత్రి చెన్నై బస్సు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఇంతలో అర్థరాత్రి కావడంతో చిన్నారి తల్లిదండ్రులు సేదతీరారు. మంగళవారం ఉదయం 2-3 గంటల సమయంలో బాలుడు తప్పిపోయినట్టు తల్లిదండ్రులు గుర్తించారు. బాబు కోసం చుట్టుపక్కల ఎంత వెతికినా, అక్కడ ఉన్న ప్రయాణికులను ఆరా తీసినా కనిపించలేదు. దీంతో..వెంటనే తిరుపతి పోలీసులను ఆశ్రయించారు.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తిరుపతి పోలీసులు.. బస్టాండ్లోని సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. బాలుడు నిద్రపోతుండగా ఓ వ్యక్తి అపహరించినట్లు గుర్తించారు. కిడ్నాపర్ బాలుడిని తీసుకుని బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వద్ద ఉన్న కెన్సస్ హోటల్ వైపు వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యింది. కిడ్నాప్ అయిన చిన్నారిని అరుల్ మురుగన్(2)గా గుర్తించారు. బాలుడిని ఎత్తుకెళ్లిన కిడ్నాపర్ వయస్సు 32 ఏళ్లు ఉంటుందని అంచనాకు వచ్చారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేయటంతో.. నిందితుడు సుధాకర్ పోలీసులకు లొంగిపోయాడు. అతని అక్క బాలుడిని పోలీసులకు అప్పగించగా.. బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.