మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. కొత్త భవనంలో తొలి బిల్లుగా రికార్డులకు ఎక్కింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే బిల్లు కాపీలను తమకు ముందుగానే ఎందుకు ఇవ్వలేదని విపక్షాలు గట్టిగా ప్రశ్నించాయి. అయితే తాము డిజిటల్ రూపంలో బిల్లును పొందుపరిచామని కేంద్రమంత్రి వివరణ ఇచ్చారు. ఈ బిల్లుకు నారీ శక్తి వందన్గా పేరు పెట్టారు. రేపు లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించనున్నారు.
కేంద్రం తీసుకువచ్చిన మహిళా బిల్లులో కీలక అంశాలు ఉన్నాయి. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కోసం 128వ రాజ్యాంగ సవరణ చేయనున్నారు. లోక్సభలో, రాష్ట్ర అసెంబ్లీలోనూ మూడోవంతు సీట్లు మహిళలకే కేటాయించనున్నారు. ఎస్సీ, ఎస్టీ కోటా సీట్లలోనూ మూడో వంతు సీట్లు మహిళలకే కేటాయించనున్నారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి.
లోక్సభలో ప్రస్తుతం 545 సీట్లు ఉండగా.. 33 శాతం రిజర్వేషన్కు అనుగుణంగా మరో 180 సీట్లను పెంచే అవకాశం కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. 2026లో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు. ఆ తర్వాతే ఈ చట్టం అమల్లోకి వస్తుంది. అంటే.. 2029 ఎన్నికల సమయంలో మహిళా రిజర్వేషన్లు అమలు కానున్నాయి.