Pm Vishwakarma Scheme : దేశంలో సంప్రదాయ వృత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన పథకం .. పీఎం విశ్వకర్మ. స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రధాని మోదీ ఢిల్లీ ఎర్రకోట నుంచి ఈ పథకాన్ని ప్రకటించారు. తాజాగా మోదీ ఈ స్కీమ్ ను ప్రారంభించారు. ఈ పథకం కోసం రూ.13 వేల కోట్లను ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఐదేళ్లలో లబ్ధిదారులకు రూ.13 వేల కోట్లను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం ద్వారా 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
పీఎం విశ్వకర్మ యోజన ద్వారా చేతివృత్తుల కళాకారులకు లబ్ధి చేకూర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రెండు రకాల శిక్షణ కార్యక్రమాలను కేంద్రం తీసుకొచ్చింది. వారికి పనిలో నైపుణ్యం పెంచేందుకు తగిన శిక్షణ ఇస్తుంది. శిక్షణ సమయంలో రోజుకు రూ.500 చొప్పున ఉపకార వేతనం అందిస్తుంది. ఈ పథకం ద్వారా ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన 18 రకాల సంప్రదాయ చేతి వృత్తిదారులకు పరికరాల కొనుగోలు కోసం రూ.15వేలు ఆర్థికసాయం అందిస్తుంది. సర్టిఫికెట్, ఐడీ కార్డ్స్ ద్వారా పీఎం విశ్వకర్మ పథకానికి ఆయా వర్గాల నుంచి అర్హులను గుర్తిస్తారు.
శిక్షణ తర్వాత వడ్డీ రాయితీతో బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. 5 శాతం వడ్డీకే ఈ లోన్ ఇస్తారు. తమ నైపుణ్యాలను మరింత అప్గ్రేడ్ చేసుకోవడం, టూల్కిట్ ఇన్సెంటివ్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, మార్కెటింగ్ను ప్రోత్సహించేందుకు ఈ లోన్లు మంజూరు చేస్తారు.
తొలి విడతలో 5 శాతం రాయితీ వడ్డీతో రూ.లక్ష మంజూరు చేస్తారు. లబ్ధిదారుడు 18 నెలల్లో ఈ మొత్తాన్ని రీ-పేమెంట్ చేయాలి. రెండో విడత రూ.2 లక్షల రుణం ఇస్తారు. ఈ మొత్తాన్ని 30 నెలల్లో రీ-పేమెంట్ చేయాలి. స్వర్ణకారులు, వడ్రంగులు, కమ్మరులు, రజకులు, దర్జీలు, క్షురకులు ఈ పథకానికి అర్హులు. అలాగే పడవలు తయారు చేసేవారు, చేప వలల తయారీదారులు, ఆయుధాలు తయారు చేసేవారు,ఇనుప పరికరాలు తయారు చేసేవారు,ఇంటి తాళాలు తయారీదారులు, విగ్రహాల తయారీదారులు, చెప్పులు తయారుచేసేవారు, తాపీ పనిచేసేవారు , నారతాళ్లు చేసేవారు, సంప్రదాయ బొమ్మలు తయారుచేసేవారు,పూలదండలు తయారు చేసేవారని ఈ పథకానికి అర్హులుగా కేంద్రం ప్రకటించింది.