మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే ఇక చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలి. ఆయా రాష్ట్రాల్లో ఎంపీ , ఎమ్మెల్యే సీట్లను కోటా ప్రకారం మహిళలకు రిజర్వు చేయాలి. ఇప్పుడు ఇదే అంశం దేశంలో హాట్ టాపిక్ గా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఎన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు దక్కనున్నాయనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఏపీలో 25 లోక్ సభ స్థానాలున్నాయి. 33 శాతం రిజర్వేషన్ల ప్రకారం.. కచ్చితంగా 9 సీట్లు మహిళలకు కేటాయించాలి. మరి ఏఏ స్థానాలను మహిళలకు కేటాయిస్తారనే ఆసక్తి నెలకొంది. ఏ ప్రాతిపదికన లోక్ సభ, అసెంబ్లీ స్థానాలను రిజర్వు చేస్తారనే చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం ఏపీ నుంచి నలుగురు మహిళలు లోక్ సభ సభ్యులుగా ఉన్నారు. అమలాపురం నుంచి చింతా అనురాధ, కాకినాడ నుంచి వంగా గీత, అనకాపల్లి నుంచి భీశెట్టి వెంకట సత్యవతి, అరకు నుంచి గొడ్డేటి మాధవి వైసీపీ నుంచి లోక్ సభ సభ్యులుగా గత ఎన్నికల్లో గెలిచారు. మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే 9 మంది మహిళలు ఏపీ నుంచి లోక్ సభలో అడుగుపెడతారు. ఏపీలో 11 రాజ్యసభ స్థానాలున్నాయి. ప్రస్తుతం అందులో ఒక్క మహిళా సభ్యురాలు కూడా లేరు. రిజర్వేషన్లు అమలైతే అప్పుడు 4 స్థానాలు మహిళలకు కేటాయించాలి. ఓవరాల్ గా పార్లమెంట్ లో ఏపీ నుంచి 13 మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తారు.
ఏపీలో 175 ఎమ్మెల్యే స్థానాలున్నాయి. 33 శాతం రిజర్వేన్ల ప్రకారం కచ్చితంగా 58 సీట్లు మహిళలకు కేటాయించాలి. ప్రస్తుతం అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు 14 మంది మాత్రమే ఉన్నారు. ఏపీ కేబినెట్ లో 26 మంది మంత్రులున్నారు. అందులో ప్రస్తుతం నలుగురే మహిళా మంత్రులు. ఆర్కే రోజా, ఉష శ్రీచరణ్, విడదల రజినీ, తానేటి వనిత కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేబినెట్ లోనూ రిజర్వేషన్ అమలైతే 9 మందికి మహిళలకు మంత్రులుగా అవకాశం దక్కుతుంది.
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలున్నాయి. మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే.. కచ్చితంగా 6 స్థానాలు మహిళలకు కేటాయించాలి. తెలంగాణ నుంచి ప్రస్తుతం పార్లమెంట్ లో ఒక్క మహిళే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.గత ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత గులాబీ పార్టీ నుంచి గెలిచారు. తెలంగాణలో 7 రాజ్యసభ స్థానాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం నుంచి మహిళలకు పెద్దల సభలో ప్రాతినిధ్యం లేదు. రిజర్వేషన్లు అమలు చేస్తే 3 స్థానాలు మహిళలకు కేటాయించాలి. అప్పుడు తెలంగాణ నుంచి 9 మంది మహిళలకు పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లభిస్తుంది.
తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలున్నాయి. రిజర్వేషన్ కోటాలో 40 సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. కేవలం ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో 18 మంత్రులు ఉన్నారు. అందులో మహిళా మంత్రులు ఇద్దరే. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కేబినెట్ మంత్రులుగా ఉన్నారు. రిజర్వేషన్లు అమలు చేస్తే..మంత్రివర్గంలోనూ ఆరుగురు మహిళలకు కచ్చితంగా కేబినెట్ లో చోటు దక్కుతుంది.
33 శాతం రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే తెలుగు రాష్ట్రాల నుంచి 15 మంది మహిళలు లోక్ సభలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. రాజ్యసభలో ఏడుగురు మహిళలకు కచ్చితంగా ప్రాతినిధ్యం లభిస్తుంది. ఓవరాల్ చూస్తే పార్లమెంట్ లో తెలుగు రాష్ట్రాల 22 మంది మహిళలు పార్లమెంట్ లో అడుగుపెట్టే అవకాశం కలుగుతుంది.