పార్లమెంట్ కొత్త భవనంలో భారత్ ప్రయాణం మొదలైంది. మంగళవారం పార్లమెంట్ పాత భవనం నుంచి ఉభయ సభ సభ్యులు కొత్త పార్లమెంట్కు పాదయాత్రగా వెళ్లారు. ప్రధాని మోదీ ముందు నడిచారు. ఆయన వెంటే మంత్రులు, ఎంపీలు భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లోని రాజ్యాంగ పుస్తకాన్ని కొత్త పార్లమెంట్ భవనంలోకి తరలించారు.
పార్లమెంట్ కొత్తభవనంలోకి వెళ్లిన వెంటనే సభ్యులు జాతీయ గీతం ఆలపించారు. ఆ తర్వాత తమ సీట్లలో కూర్చున్నారు. ఆ తర్వాత పార్లమెంట్ కార్యకలాపాలు మొదలయ్యారు. స్పీకర్ తొలుత మాట్లాడారు. ఆ తర్వాత ప్రధాని మోదీ తొలి ప్రసంగం చేశారు.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ వేళ సభ్యులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త భవనం ప్రారంభించుకోవడం శుభసూచకంగా పేర్కొన్నారు. ఆజాదీ అమృత కాలంలో ఇది ఉషోదయ కాలమని తెలిపారు. కొత్త భవనంలోకి కొత్త సంకల్పం తీసుకొని వెళ్లాలని స్పష్టం చేశారు. చంద్రయాన్ -3 విజయం దేశప్రజలు గర్వపడేలా చేసిందన్నారు. జీ-20 సమావేశాల సమర్థ నిర్వహణ భారత ప్రతిష్ఠను పెంచిందని వివరించారు. ప్రాచీన ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఆధునిక భారతీయతత్వాలకు కలబోతగా కొత్త భవనాన్ని పేర్కొన్నారు.