Asia Cup : ఆసియాకప్ ను భారత్ కైవసం చేసుకుంది. కొలంబో వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకను టీమిండియా చిత్తు చేసింది. 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 50 పరుగులకే కుప్పకూలింది. భారత్ పేసర్లు ఆ జట్టు బ్యాటర్లను వణికించారు. బుమ్రా తొలి వికెట్ తీసి శుభారంభాన్ని అందిస్తే.. మహ్మద్ సిరాజ్ ఒకే ఓవర్ లో 4 వికెట్లు తీసి లంకను కోలుకోలేని దెబ్బతీశాడు. చివరి 3 వికెట్లను హార్థిక్ పాండ్యా పడగొట్టాడు. దీంతో ఆ జట్టు 15.2 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యింది. లంక జట్టులో ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు.
51 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (23 నాటౌట్), శుభ్ మన్ గిల్ (27 నాటౌట్ ) అజేయంగా 51 పరుగులు జోడించారు. దీంతో టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ 21.3 ఓవర్లలోనే ముగియడం విశేషం.
6 వికెట్లు తీసిన సిరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆసియా కప్ లో 9 వికెట్లు తీసిన కులదీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.