హైదరాబాద్ తుక్కుగూడ విజయభేరి బహిరంగ సభ వేదికగా రాహుల్ గాంధీ కీలకమైన హామీని ప్రకటించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తామన్నారు. ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు రూ. 5 లక్షల ఇస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక వరాలు ప్రకటించారు. వారికి 250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీఆర్ఎస్ తోపాటు బీజేపీ, ఎంఐఎంలతోనూ కాంగ్రెస్ పోరాడుతోందన్నారు. ఈ పార్టీలన్నీ కలిసి ఒకే ఎజెండాతో పని చేస్తున్నాయని ఆరోపించారు.
కేంద్ర పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సాగు చట్టాల బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మనం ఎవరితో పోరాడుతున్నామో మనకు తెలియాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ మీటింగ్ ను అడ్డుకోవాలని చూశారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలపై కేసులు పెడుతున్నారని విమర్శించారు.
కేసీఆర్, ఎంఐఎం నేతలపై కేసులు లేవని రాహుల్ గాంధీ అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ కాంగ్రెస్ నేతల వెంటే పడుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ , ఒవైసీ.. బీజేపీకి మద్దతుదారులని ఆరోపించారు. అందుకే వారిపై కేసులు పెట్టడంలేదన్నారు.
కేసీఆర్ కుటుంబ లాభం కోసం తెలంగాణ ఇవ్వలేదని రాహుల్ గాంధీ వివరించారు. పేదలు, రైతులు, కార్మికుల కోసం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని చెప్పారు. కానీ వారెవరికి ప్రయోజనం దక్కలేదన్నారు.