Mallikarjun Kharge : హైదరాబాద్ నిర్వహిస్తున్న cwc సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభోపన్యాసం చేశారు. అణగారిన వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి, ఆహార భద్రతను అందించాలన్నారు. అందుకోసం కులగణన చేపట్టాలని కోరారు. జనాభా లెక్కల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశం అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు. హింసాత్మక ఘటనలు.. భారత ప్రతిష్ఠను దిగజార్చుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ అగ్నికి ఆజ్యం పోస్తోందని ఆరోపించారు.
దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, నిత్యవసరాల ధరలు పెరుగుతున్నాయని ఖర్గే వివరించారు. రైతులు, కార్మికుల జీవితాల్లో మార్పును తీసుకురావడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. చైనా ఆక్రమణల విషయంలో నిర్లక్ష్యం దేశ భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్ హింసాత్మక ఘటనలన దేశం గమనిస్తోందన్నారు. హర్యానాలోని నూహ్ లో అల్లర్లకు మోదీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఇలాంట హింసాత్మక ఘటనలు లౌకిక భారత ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలోని సమస్యలపై పోరాడేందుకు ‘ఇండియా’ కూటమిలో 27 పార్టీలు ఏకతాటిపై ఉన్నాయని ఖర్గే స్పష్టం చేశారు. అందుకే ప్రతిపక్ష పార్టీలపై ప్రతీకార చర్యలకు కేంద్రం పాల్పడుతోందని ఆరోపించారు. పార్లమెంట్లో ప్రతిపక్షాల అణచివేతకు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. అధికార పార్టీ ఉద్దేశాల విషయంలో ఆందోళనలు రేకేత్తిస్తున్నాయన్నారు.
5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు హైదరాబాద్ లో CWC సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ భగేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్, పార్టీ సీనియర్ నేతలు చిదంబరం, వీరప్ప మొయిలీ ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు.