టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి రాజమండ్రిలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి తిలక్ రోడ్డులోని సాయిబాబా ఆలయం వద్ద నుంచి శ్యామలానగర్ రామాలయం జంక్షన్ వరకు ఈ ర్యాలీ తీశారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు.
రాజకీయ కుట్రతోనే చంద్రబాబును జైలుకు పంపారని నారా బ్రాహ్మణి ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న దురుద్దేశంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్కు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
తమ కుటుంబానికి ఈ పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని బ్రహ్మణి అన్నారు. చంద్రబాబు తెలుగు రాష్ట్రాలను ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ఆయన చేసిన నేరమా? అని ప్రశ్నించారు. లక్షల మంది యువతకు నైపుణ్యం పెంచేలా కృషి చేశారన్నారు. అభివృద్ధి, సంక్షేమం చేయడం నేరమా? ఉద్యోగాలు కల్పించడం నేరమా? అని నిలదీశారు.
చంద్రబాబు అరెస్టును దేశమంతా ఖండిస్తోందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. జాతీయ నేతలు వైసీపీ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారని వివరించారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారనే నమ్మకం ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వంపైనా బ్రాహ్మణి ఘాటు విమర్శలు చేశారు. ప్రభుత్వం గంజాయి, లిక్కర్ తో యువత జీవితాలను నాశనం చేస్తోందని ఆరోపించారు.