చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్తకర్తలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం సంచలన రేపుతోంది.
గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో సీఎం వైఎస్ జగన్ నివాసానికి సమీపంలో ఉన్న పేదలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వార్డు సచివాలయ వాలంటీర్లు ఇళ్లకు నోటీసులు అందజేశారు. వారంలోగా ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశించారు. కాలువకట్ట వెంబడి ఉన్న ఇళ్ల యజమానులకు ఈ నోటీసులు ఇచ్చారు. ఇళ్లు ఖాళీ చేయకపోతే తామే తొలగిస్తాని అధికారులు వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది.
ప్రభుత్వ ఆదేశాలపై అమరారెడ్డి నగర్, మదర్ థెరీసా కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. తాము దాదాపు 40 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో ఉంటున్నామని చెబుతున్నారు. ఇళ్లు ఖాళీ చేయమంటే ఎలా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
సీఎం జగన్ భద్రతను కారణంగా చూపి ఇళ్లు ఖాళీ చేయాలని ఏడాది క్రితమే అధికారులు కాలనీ వాసులకు సమాచారం ఇచ్చారు. తమకు ప్రత్యామ్నాయం చూపిస్తే ఖాళీ చేస్తామని ఆ సమయంలో బాధితులు తెలిపారు. దీంతో అమరావతిలో వారికి సెంటు ఇళ్ల స్థలం ప్రభుత్వం ఇచ్చింది. ప్రస్తుతం అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణ పనులు కోర్టు ఆదేశాలతో నిలిచిపోయాయి. మరి వారంతా ఎక్కడికి వెళతారనేది ప్రశ్నార్థకంగా మారింది.