KCR : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభమైంది. బిరబిరా కృష్ణమ్మ పారింది. నార్లాపూర్ తొలి పంపును సీఎం కేసీఆర్ స్విచ్ ఆన్ చేశారు. డెలివరి సిస్టర్న్ వద్ద ప్రత్యేక పూజలు చేసి గంగాహారతి ఇచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైలాన్ ను ఆవిష్కరించారు.
శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా కృష్ణా నది నుంచి కోతిగుండు ద్వారా నీరు తీసుకొచ్చేలా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. భూగర్భంలో పంపుహౌజ్ ఏర్పాటు చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రోజు 2 టీఎంసీల నీరు లిఫ్ట్ చేసే విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి అప్రోచ్ కాల్వ ద్వారా నార్లాపూర్ ఇన్టేక్ వెల్కు చేరుకునే కృష్ణా జలాలను.. స్విచ్ నొక్కడం ద్వారా 104 మీటర్లుపైకి ఎత్తి సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్లోకి పోసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
కాళేశ్వరం రికార్డును బ్రేక్ చేసేలా 145 మెగావాట్ల కెపాసిటీ కలిగిన 9 భారీ మోటార్లను బిగించారు. 915 కిలోమీటర్ల ప్రాథమిక కాల్వను నిర్మించారు. రోజుకు 3,200 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయగల కెపాసిటీ ఉన్న ఈ పంపు ద్వారా 2 TMCల నీటిని నార్లాపూర్ జలాశయానికి తరలించి నిల్వ చేస్తారు.
ఈ ప్రాజెక్టు కోసం రూ.35 వేల కోట్లు తెలంగాణ సర్కార్ ఖర్చు చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలో 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. 1200 గ్రామాలకు తాగునీరు అందిస్తారు. పరిశ్రమలకు నీటిని సరఫరా చేస్తారు.
ప్రాజెక్టు ప్రారంభోత్సం తర్వాత కొల్లాపూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్రంపై కేసీఆర్ విరుచుకు పడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చలేదని ప్రధాని మోదీపై మండిపడ్డారు. విశ్వగురు అనే చెప్పుకొనే మోదీ.. నీళ్ల వాటా తేల్చడం లేదన్నారు. 10 ఏళ్లుగా కృష్ణా ట్రైబ్యునల్కు ఎందుకు ప్రతిపాదనలు పంపటం లేదని నిలదీశారు.
కొల్లాపూర్ నియోజకవర్గంపై కేసీఆర్ వరాలు జల్లు కురిపించారు. ఈ ప్రాంత అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేస్తామన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రూ.15 లక్షలు ప్రత్యేక నిధులు ప్రకటించారు. కొల్లాపూర్కు పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేస్తున్నామని చెప్పారు.