ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్లీ తెరపైకి వచ్చింది.ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో తొలి నుంచి ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్రపిళ్లై బుధవారం అప్రూవర్గా మారారు. ఈ మేరకు ప్రత్యేక జడ్జి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డు చేశారని తెలుస్తోంది. గతేడాది మార్చి 7న అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనను విచారించి కీలక సమాచారం సేకరించారు.
ఈ విచారణ సమయంలోనే అరుణ్ రామచంద్ర పిళ్లై తొలుత అప్రూవర్గా మారారు. పిళ్లై వాంగ్మూలం ఆధారంగా విచారణకు రావాలని కవితకు ఈడీ అధికారులు అప్పట్లో సమన్లు జారీ చేశారు. ఆమెను విచారించారు. ఈ ఏడాది మార్చి 11న ఈడీ ఎదుట కవిత విచారణకు హాజరయ్యారు. అయితే ఆ సమయంలో పిళ్లై తన నిర్ణయం మార్చుకున్నారు. ఈడీ అధికారులు తనపై ఒత్తిడి చేసి కవిత పేరు చెప్పించారని ఆరోపిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణ కొనసాగుతున్న సమయంలోనే తాజాగా మరోసారి పిళ్లై అప్రూవర్గా మారారని సమాచారం.
తాజాగా కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం పొలిటికల్ గా హీట్ పెరుగుతోంది. విచారణ మధ్యలో ఆగిపోవడంతో ఈ కేసు విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమీపిస్తున్న వేళ మళ్లీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.