వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పవన్ క్లారిటీ ఇచ్చేశారు. జనసేన, టీడీపీ కలిసే వెళ్తాయని తేల్చిచెప్పేశారు. తాను ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన భవిష్యత్తు కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయని తెలిపారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామన్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కలిసి ములాఖత్ అయ్యారు. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన పవన్ సంచలన విషయాలు ప్రకటించారు. గత నాలుగున్నరేళ్లుగా ఏపీలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఆయనకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చానన్నారు.
గతంలో బీజేపీకి మద్దతు ఇవ్వడంపైనా పవన్ వివరణ ఇచ్చారు. దేశానికి బలమైన నాయకుడు కావాలని అనుకున్నానని తెలిపారు. మోదీకి మద్దతు తెలిపిన సమయంలో తనను అందరూ తిట్టారని గుర్తు చేశారు. ఇప్పటివరకు మోదీ పిలిస్తేనే వెళ్లానని వివరించారు. ఆ స్థాయి నాయకుల సమయం వృథా చేయనన్నారు.
విడిపోయిన ఏపీకీ అనుభవం ఉన్న నాయకుడు కావాలని అనుకున్నానని అందుకే 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చానని స్పష్టం చేశారు. ఇప్పుడు వైసీపీ పాలనతో విసిగిపోయామన్నారు. హైటెక్ సిటీ సృష్టించిన విజనరీకి ఈ దుస్థితి ఏంటి? అని జనసేనాని ప్రశ్నించారు.
ఏపీ దుస్థితిని, చంద్రబాబు భద్రత విషయాన్ని ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. గవర్నర్కు కూడా తెలియజేస్తామన్నారు. అక్రమంగా ఇసుక, మైనింగ్, బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.
యుద్ధమే కావాలంటే యద్ధానికి సిద్ధమేనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
చట్టాలను అతిక్రమించి పని చేసే అధికారులు ఆలోచించుకోవాలని సూచించారు.
పోలీసు వ్యవస్థ బానిసత్వంగా ఉంటే ఎవరేం చేయలేరన్నారు. వాళ్లకు ఆరు నెలల సమయం మాత్రమే ఉందన్నారు. యుద్ధమే కావాలంటే యద్ధానికి సిద్ధమేనని తేల్చిచెప్పారు. రాళ్లు వేసిన ఎవరినీ వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ నేతలు రాళ్లు వేసేముందే ఆలోచించుకోవాలన్నారు.
రాజమండ్రిలో చంద్రబాబు కుటుంబ సభ్యులను జనసేనాని పరామర్శించారు.