తెలంగాణ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమయ్యే బిల్లుకు ఎట్టికేలకు మోక్షం కలిగింది. గవర్నర్ తమిళిసై ఈ బిల్లును ఆమోదించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ఈ బిల్లును అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సభ ఆమోదం తర్వాత ఈ బిల్లును గవర్నర్ కు పంపించింది.
ఆర్టీసీ బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించలేదు. ఆ తర్వాత కొన్ని అంశాలపై వివరణ కోరారు. అలాగే 10 సిఫారసులు చేశారు. ఈ సమయంలో రాజ్ భవన్ వద్ద ఆర్టీసీ ఉద్యోగులు నిరసనకు దిగారు. బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.
గవర్నర్ తమిళిసై ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు పిలిచారు. ఉద్యోగులకు మంచి జరగాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. గవర్నర్ పంపిన సిఫారసుల తర్వాత ప్రభుత్వం వివరణలు పంపింది. సర్కార్ చెప్పిన విషయాలపై సంతృప్తి చెందిన గవర్నర్ తాజాగా బిల్లుకు ఆమోదముద్ర వేశారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీలో పనిచేస్తున్న 43,373 మంది ఉద్యోగులు ఇక సర్కార్ ఉద్యోగులవుతారు.