చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ సమయంలోనే టీడీపీ, జనసేన బలం మరింత బలపడుతోంది. టీడీపీ అధినేత అరెస్ట్ అయిన వెంటనే జనసేనాని సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబును కోర్టుకు తీసుకొస్తున్న సమయంలో కలిసేందుకు ప్రయత్నించారు.
తొలుత విమానంలో విజయవాడ వచ్చేందుకు పవన్ ప్రయత్నించారు. కానీ అనుమతులు రాకపోవడంతో రోడ్డుమార్గంలో విజయవాడకు పయనమయ్యారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే పడుకుని నిరసన తెలిపారు. అయినా సరే పోలీసులు ఆయన వెళ్లనీయలేదు. దీంతో ఆ రోజు చంద్రబాబును కలవలేకపోయారు.
ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు పవన్ సిద్ధమయ్యారు. గురువారం చంద్రబాబుతో జనసేనాని ములాఖత్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజా రాజకీయ అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారని సమాచారం.
మరోవైపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత జనసేన కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. టీడీపీతో కలిసి నిరసనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను విశాఖ జిల్లా జనసేన నేతలు కలిశారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్, చోడవరం ఇన్ఛార్జి పీఎస్ఎస్ రాజు, జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ రాజమండ్రిలో లోకేశ్ను కలిసి పరామర్శించారు. చంద్రబాబును తప్పుడు కేసులతోనే జైలులో పెట్టారని మండిపడ్డారు. అక్రమ కేసులతో వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. తనకు అండగా నిలుస్తున్న జనసేన నాయకులకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీని ఏపీ నుంచి తరిమికొట్టేందుకు కలిసి పోరాడదామని స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయమని ఎప్పుడో తేలిపోయింది. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చలు కూడా జరిపారు. ఆ తర్వాత పొత్తులపై ఇరుపార్టీలు పెద్దగా స్పందించలేదు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ, జనసేన బంధం మరింత బలపడింది.