స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిశారు. ఇటు ఏసీబీ కోర్టులో, అటు హైకోర్టులో ఆయన పిటిషన్లు వేసి వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబుతో ఏం మాట్లాడతారనేది చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబును కలవడానికి ముందు సిద్దార్థ్ లూథ్రా సంచలన ట్వీట్ చేశారు. అన్ని ప్రయత్నాలు చేసినా.. న్యాయం కనుచూపుమేర లేకుంటే ఇక కత్తిపట్టడమే నేటి సూక్తి అంటూ అందులో పేర్కొన్నారు. పోరాటానికి ఇదే సరైన విధానమని స్పష్టం చేశారు. గురుగోవింద్ సింగ్ సూక్తులను లూథ్రా ప్రస్తావించారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు తరుఫున వాదనలు వినిపిస్తున్నారు సిద్ధార్థ్ లూథ్రా. ఆయనకు అడుగడుగునా చుక్కెదురవుతోంది. దీంతో ఈ ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే కత్తితో పోరాటం చేయాల్సిందేనని చెబుతున్న ఆయన వ్యాఖ్యల ఆంతర్యం ఏంటని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.