టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన హౌస్ కస్టడీ పిటిషన్ను న్యాయమూర్తి తిరస్కరించారు. ఈ పిటిషన్పై రెండురోజులపాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి.
చంద్రబాబుకు జైల్లో పూర్తి భద్రత కల్పించామని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయస్థానానికి తెలిపారు. జైలు పరిసర ప్రాంతాల్లోనూ పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఎదురైతే వైద్య సదుపాయం ఏర్పాటు చేశామని కోర్టుకు వివరించారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో 50 అడుగుల ఎత్తైన గోడలు ఉన్నాయన్నారు. ఆర్థికనేరాల్లో సాక్ష్యాలను ప్రభావం చేసే అవకాశం ఉండటం వల్ల.. చంద్రబాబును హౌస్ రిమాండ్కు అనుమతించవద్దని కోర్టును కోరారు.
చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబుకు జైలులో ప్రమాదం పొంచి ఉందన్నారు. కరుడుగట్టిన నేరస్థులు అదే జైల్లో ఉన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబుకు ముప్పు ఉన్న నేపథ్యంలోనే ఎన్ఎస్జీ భద్రత కల్పించారని వివరించారు. కేంద్రం కల్పించిన సెక్యూరిటీపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని తెలిపారు. హౌస్ రిమాండ్కు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లూథ్రా ప్రస్తావించారు. గౌతం నవలాఖ కేసును ప్రత్యేకంగా ఉదహరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్ను తిరస్కరించారు.
మరోవైపు చంద్రబాబును అరెస్టుపై మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా ఎలా అరెస్టు చేస్తారు? అని ప్రశ్నించారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం అనుమతి లేకుండా ఎలా అరెస్టు చేస్తారు? అని నిలదీశారు. సీఐడీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ బుధవారం చేపడతామని హైకోర్టు తెలిపింది.