కొలంబో పిచ్ పై భారత్ బ్యాటర్లు పెను విధ్వంసం సృష్టించారు.సూపర్ -4 మ్యాచ్ లో పాక్ పై ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీలతో మెరుపు ఆరంభాన్ని అందిస్తే.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో కదం తొక్కారు. రెండో వికెట్ 233 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 356 పరుగులు చేసింది. వర్షం వల్ల తొలిరోజు ఆట ఆగిపోయే సమయానికి భారత్ జట్టు 24.1 ఓవర్ల రెండు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. వర్షం తగ్గకపోవడంతో ఆట సాధ్యం కాలేదు. దీంతో రిజర్వ్ డేకు ఆటను పొడిగించారు.
రెండో రోజు కూడా వర్షం వల్ల ఆలస్యంగా ఆట మొదలైంది. తొలుత కోహ్లీ, రాహుల్ ఆచితూచి ఆడారు. నెమ్మెదిగా గేర్ మార్చారు . హాఫ్ సెంచరీలు పూర్తైన తర్వాత దూకుడు మరింత పెంచారు. కోహ్లీ (122 నాటౌట్, 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులు), కేఎల్ రాహుల్ (111నాటౌట్, 106 బంతుల్లో 12 ఫోర్లు , 2 సిక్సులు) అద్భుతంగా ఆడారు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
తొలుత రోహిత్ (56, 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు ), గిల్ (58, 52 బంతుల్లో 10 ఫోర్లు) పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. తొలి వికెట్ కు 121 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. రోహిత్, గిల్ వెంటవెంటనే అవుటైనా.. కోహ్లీ, రాహుల్ మరో వికెట్ పడకుండా జట్టు స్కోరును 350 పరుగులు దాటించారు.
పాక్ బౌలర్లలో షాహిన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీశారు. లీగ్ దశలో భారత్ , పాక్ మ్యాచ్ వర్షం వల్ల రద్దైంది. కానీ ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 266 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ మ్యాచ్ ఒక దశలో టీమిండియా రోహిత్ , గిల్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వికెట్లను ఆరంభంలోనే కోల్పోయింది. కానీ ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్యా హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ స్కోర్ 250 పరుగులు దాటింది. కానీ లీగ్ మ్యాచ్ లో విఫలమైన రోహిత్ ,గిల్, కోహ్లీ సూపర్-4 మ్యాచ్ లో పాక్ బౌలర్లను చీల్చిచెండాడారు. అయ్యర్ ప్లేస్ లో జట్టులోకి వచ్చిన రాహుల్ కూడా సెంచరీతో విధ్వసం సృష్టించడంతో భారత్ జట్టు భారీ స్కోర్ చేసింది.