చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691గా ఉన్నారు. చంద్రబాబును హౌస్ రిమాండ్ లో ఉంచాలని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. హౌస్ రిమాండ్ అవసరం లేదని ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు..
చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో పటిష్ట భద్రత కల్పించామన్నారు. జైలులో ప్రత్యేక గది కేటాయించామని అలాగే సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. చంద్రబాబు భద్రతపై తీసుకున్న చర్యలపై జైళ్ల శాఖ డీజీ ఇచ్చిన ఆదేశాల లేఖను కోర్టు ముందుంచారు. జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న నిందితుడి భధ్రతా బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. చంద్రబాబు కోరిన విధంగా కోర్టు ఆదేశాలతో ఇంటి భోజనం, మందులు అందిస్తున్నామన్నారు. హౌస్ రిమాండ్ పిటిషన్ కొట్టివేయాలని కోరారు.
ఏఏజీ పొన్నవోలు వాదనలు..
ఏపీ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా వాదనలు వినిపించారు. చంద్రబాబుకు ఇంట్లో కన్నా జైల్లోనే సెక్యూరిటీ ఉంటుందని స్పష్టం చేశారు. రాజమండ్రి జైలుకు 50 అడుగుల ఎత్తైన గోడ ఉందన్నారు. అక్కడికి ఎవరు రాలేరన్నారు. చంద్రబాబుకు జైల్లో పూర్తిస్థాయి సెక్యూరిటీ కల్పించామని చెప్పారు. జైలు పరిసరాల్లోనూ పోలీసు సెక్యూరిటీ ఉందని వివరించారు. 24 గంటలు పోలీసులు డ్యూటీలో ఉన్నారని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. డాక్టర్స్ 24 గంటలు అందుబాటులో ఉంటారని చెప్పారు. చంద్రబాబుకు ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. అందువల్ల హౌస్ రిమాండ్ అవసరం లేదన్నారు. ఆర్థిక నేరాల్లో సాక్ష్యాలను ప్రభావం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు..
చంద్రబాబుకు జైలులో ప్రమాదం ఉందని ఆయన తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు ఇప్పటివరకు ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఆయనకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు.
హౌస్ కస్టడీకి సంబంధించి గౌతం నవార్కర్ కేసును ఉదహరించారు.హైకోర్టుకు వెళ్లి తెచ్చుకున్న భద్రత పెంపు ఆదేశాలు అమల్లో ఉన్నాయని వెల్లడించారు.
చంద్రబాబును హౌస్ రిమాండ్కు ఇవ్వాలని కోరారు.