బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదం హైకోర్టులో ఉంది. ఈ కేసుపై విచారణ జరుగుతోంది. తాజాగా హైకోర్టులో జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్కు బండి సంజయ్ హాజరుకాలేదు. ఆయన కోర్టుకు రాకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే పలుమార్లు క్రాస్ ఎగ్జామినేషన్కు బండి సంజయ్ తరఫు న్యాయవాది గడువు కోరారు.
ప్రస్తుతం బండి సంజయ్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి గడువు ఇవ్వాలని హైకోర్టుకు బండి సంజయ్ తరఫున న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో బండి సంజయ్ తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎన్నికల పిటిషన్లు 6 నెలల్లో తేల్చాల్సి ఉంటుంది. అందుకే విచారణ ముగిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 12న బండి సంజయ్ హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరవ్వాలంటే సైనిక సంక్షేమ నిధికి రూ. 50 వేలు చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.