హైదరాబాద్ ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో ఓ ఉన్మాది బరితెగించాడు. ఓ ఇంట్లోకి చొరబడి ఓ యువతి, ఆమె సోదురుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువతి తమ్ముడి ప్రాణాలు కోల్పోయాడు. ఆమె తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం ఆదివారం ఆర్టీసీ కాలనీలోని సంఘవి అనే యువతి ఇంటికి రామంతపూర్కి చెందిన శివకుమార్ వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో సంఘవి, ఆమె సోదరుడు చింటూ ఉన్నారు. ఈ క్రమంలో చింటూ, శివకుమార్ మధ్య గొడవ జరిగింది.
శివకుమార్ తన వెంట తెచ్చుకున్న కత్తితో సంఘవి, చింటూపై దాడి చేశాడు. ఆ భవనంలోని మొదటి అంతస్థులో ఈ దాడి జరిగింది. కిటికీ అద్దాలు పగిలిన శబ్ధం రావడంతో వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన యువకుడిని ఇంట్లోనే బంధించారు. తీవ్ర గాయపడిన సంఘవి, చింటూను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చింటూ మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు.
ప్రస్తుతం సంఘవి ఆస్పత్రిల చికిత్స పొందుతోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శివకుమార్ ను ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.