Thummala Nageswara Rao: ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ లీడర్ తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారడం ఖాయమని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ లో ఆయన కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి తుమ్మల ఢిల్లీ వెళతారని సమాచారం. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరతారని అంటున్నారు. కాంగ్రెస్లో చేరబోతున్నట్లు ఇప్పటికే అనుచరులకు తుమ్మల చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా గండుగులపల్లి గ్రామంలో పాలేరు నియోజకవర్గానికి చెందిన 100 మంది ముఖ్య నేతలు, అనుచరులతో తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. వచ్చే నెలలో పాలేరు నియోజకవర్గంలో భారీ సభ నిర్వహించాలని తుమ్మల భావిస్తున్నారు.
బీఆర్ఎస్ తరఫున పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయాలని భావించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి గులాబీ బాస్ కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కందాల గెలిచారు. ఆ తర్వాత హస్తానికి హ్యాండిచ్చి కారెక్కారు. గత ఎన్నికల్లో కందాల చేతిలో తుమ్మల ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకే టిక్కెట్ ఇవ్వడంతో తుమ్మల తన రాజకీయ భవిష్యత్తుపై కొన్నిరోజులుగా అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. ఖమ్మంలో భారీగా కార్ల ర్యాలీ నిర్వహించారు. తన బలాన్ని చాటే చెప్పే ప్రయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఆయనకు ఎలాంటి భరోసా లభించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు.
తుమ్మలకు ఖమ్మం , పాలేరు నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. 2016 ఉపఎన్నికలో పాలేరు నుంచి తుమ్మల బీఆర్ఎస్ తరఫున గెలిచారు. ఆ తర్వాత మంత్రి పదవిని చేపట్టారు. కానీ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇప్పుడు టిక్కెట్ దక్కకపోవడంతో ఇక కారు నుంచి దిగిపోవాలని నిర్ణయించుకున్నారు. పాలేరు నుంచి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు మంచి బలం ఉంది. వామపక్షాల ప్రభావం ఉంది. దీంతో వచ్చే ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.