Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో భయానక ఘటన జరుగుతోంది. కావాలని చేస్తున్నారో ఆకతాయిల పనో తెలియదు కానీ.. అక్కడ ప్రజలు మాత్రం రాత్రిపూట భయంభయంగా బతుకుతున్నారు. తెల్లారితే ఇళ్ల ముందు ఎక్కడ రక్తపు మరకలు చూడాల్సి వస్తుందోనంటూ గజగజా వణుకుతున్నారు. ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని.. వినని…ఘటనలు.. ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయంటూ భయంతో ఉన్నారు.
మహబూబాబాద్ శివారు రజాలీపేటలో అర్ధరాత్రి ఇళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు రక్తం జల్లుతున్నారు. రెండురోజులుగా ఇళ్లు, ఖాళీ స్థలాల్లో ఎక్కడ చూసినా రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. దుండగులు అర్ధరాత్రి కరెంట్ తీసి ఈ చర్యకు పాల్పడుతున్నారు. దీంతో ఆ ప్రాంత వాసులు అర్థరాత్రి హడలిపోతున్నారు. ఇదంతా చేస్తుంది ఎవరు? ఎందుకు రక్తం చల్లుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారో అంతుపట్టడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయం భయంగా గడుపుతున్నారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. రజాలీపేటలో జరుగుతున్న ఘటనల వెనుక వాస్తవాలను వెలికితీసే చర్యలు చేపట్టారు. అక్కడున్న వారిలో భయం పోగొట్టేందుకు యత్నిస్తున్నారు.