ఏపీలో ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. వైసీపీ టార్గెట్గా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ పవన్ కల్యాణ్ గట్టిగా అరిచి మరీ చెబుతున్నారు. చంద్రబాబు మాత్రం పొత్తులపై వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. బీజేపీ, టీడీపీ స్నేహంపైనే అందరి ఫోకస్ ఉంది.
ఇన్నాళ్లూ జనసేనానియే టీడీపీని బీజేపీకి దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ లిస్టులో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని కూడా చేర్చారు. పురందేశ్వరినే దగ్గరుండి మరీ చంద్రబాబును బీజేపీ పెద్దలతో మాట్లాడిస్తున్నారంటూ విమర్శలు చేస్తోంది వైసీపీ. ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం రిలీజ్ సందర్భంగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు చాయ్ పే చర్చ చేపట్టడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. వారిద్దరూ జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై చర్చించారని అంటున్నారు. జగన్ పాలన వైఫల్యాలు.. ఓటర్ల తొలగింపులో అక్రమాలను.. నడ్డా దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారని తెలుస్తోంది.
ఇప్పటికే నడ్డా, అమిత్షాతో చంద్రబాబు ఓ దఫా భేటీ అయ్యారు. ఇది జరిగి నెలలు అవుతున్నా.. మళ్లీ ముందడుగు పడలేదు. ఇప్పుడు ఢిల్లీలో మరోసారి నడ్డా, బాబు సమావేశం కావడంతో.. వారిమధ్య స్నేహం మరింత చిగురించిందని అంటున్నారు. ఒకప్పుడు చంద్రబాబు పేరెత్తడానికే ఇష్టపడని కమలం నేతలు.. ఇటీవల బాబుతో ఇష్టంగా మాట్లాడుతున్నారు. ఇందుకు పవన్ కల్యాణే కారణం. జగన్ను గద్దె దించాలంటే.. మూడు పార్టీల పొత్తు తప్పనిసరి అని ఢిల్లీ బీజేపీకి గట్టిగా నచ్చబెప్పారట. మెత్తబడిన కమలనాథులు.. బాబుపై మునుపటి ధ్వేషాన్ని తీసి గట్టున పెట్టేశారని.. త్వరలోనే పొత్తు చర్చలు కూడా ఉంటాయని అంటున్నారు.
నడ్డా, చంద్రబాబు భేటీకి ఈసారి పురందేశ్వరియే మధ్యవర్తిత్వం వహించారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్లో రచ్చ స్టార్ట్ చేసేశారు. “మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఇష్టంలేకపోయినా.. పతీసమేతంగా మరిదిని తీసుకెళ్లి కలిపించావు. ఆయనకు బలవంతంగా ఏదో చెప్పే ప్రయత్నం చేశావు. మీరంతా ఒక్కటే.. అందుకే కదా దొంగ చేతికి తాళం ఇచ్చింది.. ఇంతకంటే ఆధారం కావాలా చిన్నమ్మ” అంటూ పురందేశ్వరీ టార్గెట్గా ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.
మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ను చంద్రబాబును కలిపేందుకు సైతం పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారని మరో వైసీపీ నాయకురాలు, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి విమర్శించారు. ఎన్టీఆర్ నాణేన్ని ముద్రించడం మాత్రమే ఆర్బీఐ చేసిందని.. విడుదల కార్యక్రమాన్ని పురందేశ్వరియే తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిందని అంటున్నారు. నాణెం విడుదల ఎన్నికల వ్యూహమేనని ఆరోపించారు లక్ష్మీపార్వతి.
నాణెమో, వ్యూహమో.. ఢిల్లీలో ఏపీ అప్డేట్స్ ఆసక్తికర టర్న్ తీసుకుంటున్నాయి. ఏపీలో పొత్తు రాజకీయం రక్తి కడుతోంది.