KCR : మునుగోడు ఉపఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఆ నియోజకవర్గంలో కేసీఆర్ బహిరంగ సభ అంటే అందరిలోనూ ఉత్సుకత ఉంటుంది. చండూరు బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారా? అని ప్రజలు ఎదురుచూశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సంచలన అంశాలు బయటపెడతారని ఆశించారు. మునుగోడుకు వరాల జల్లు కురిపిస్తారని అనుకున్నారు. కానీ ఇవేమి జరగలేదు. బీజేపీ, మోదీపై విమర్శలకే తన ప్రసంగాన్ని పరిమితం చేశారు కేసీఆర్. మునుగోడు ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికను వివరించలేదు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మునుగోడును అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
ఇంకా కేసీఆర్ ఏం చెప్పారంటే..
అవసరం లేకుండానే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని కేసీఆర్ అన్నారు. ఫలితం కూడా ప్రజలు ఎప్పుడో తేల్చేశారంటూ గెలుపుపై డాబు ప్రదర్శించారు. ఉపఎన్నిక రాగానే లొల్లి మొదలైందన్నారు. ఒళ్లు మరిచిపోయి ఓటేస్తే ఇల్లు కాలిపోతుందని ప్రజలను హెచ్చరించారు. ఆలోచించి ఓటేస్తే మునుగోడు బాగుపడుతుందని సూచించారు. బీజేపీని ఉద్దేశిస్తూ కరిసే పాము మెడలో వేసుకుంటామా అని ప్రజలను ప్రశ్నించారు. ఓటేసేటప్పుడు చైతన్యవంతంగా ఆలోచించాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై..
ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని వచ్చారని కేసీఆర్ మండిపడ్డారు. వందకోట్లకు ఆత్మగౌరవాన్ని కొందామని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఎమ్మెల్యేలు ఆ ఆఫర్ ను ఎడమకాలితో తన్నారని.. అంగట్లో పశువుల్లా అమ్ముడుపోకుండా తెలంగాణ జాతి గౌరవాన్ని కాపాడారని మెచ్చుకున్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలను వేదికపై నిలబెట్టి ప్రశంసించారు కేసీఆర్. ఇటు వంటి ఎమ్మెల్యేలు రాజకీయాలకు కావాలన్నారు. రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదని ఈ ఎమ్మెల్యేలు నిరూపించారని పొగడత్తలతో ముంచెత్తారు. ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు ఉన్న వ్యక్తులు వచ్చి ఎమ్మెల్యేలతో బేరానికి దిగారని కేసీఆర్ ఆరోపించారు. వారంతా ఇప్పుడు చంచలగూడ జైలులో ఉన్నారన్నారు. 20, 30 మంది ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై విచారణ జరగాలని స్పష్టం చేశారు. దీని వెనుక ఎవరున్నారో తేలాలన్నారు కేసీఆర్.
గెలిపిస్తేనే మునుగోడు అభివృద్ధి
మునుగోడు అభివృద్ధి కోసం కేసీఆర్ వరాలు ప్రకటిస్తారని ప్రజలంతా భావించారు. కానీ కేసీఆర్ ఎలాంటి హామీలు ఇవ్వలేదు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల గురించి గొప్పలు చెప్పుకొచ్చారు. పనిలో పనిగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిపించి మునుగోడును అభివృద్ది చేసుకోండిని ప్రజలపైనే భారం వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మునుగోడు సమస్యలు పరిష్కరిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రలోభాలకు ఆశ పడితే గోసపడతామన్నారు. తన బంధు బలగమంతా తెలంగాణ ప్రజలే అన్నారు. ప్రజలు సహకరించకపోతే ఏమీ చేయలేమని నిస్సాహాయత వ్యక్తం చేశారు. పాలను నీళ్లను వేరుచేసి చూసే విజ్ఞత ప్రజలకు రావాలన్నారు. మరి కేసీఆర్ మునుగోడు అభివృద్ధికి ఎలాంటి హామీలు ఇవ్వలేదు కాబట్టి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.