ఎన్టీఆర్ రూ.100 స్మారక నాణేం విడుదల కార్యక్రమం నిర్వహించిన తీరుపై వివాదం రేగింది. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, ఆర్థిక మంత్రికి లక్ష్మీపార్వతీ లేఖ రాశారు. తాజాగా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పేరుతో రూ.100 నాణెం విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. కానీ తనను ఆహ్వానించకపోవడం బాధకలిగించందన్నారు.
ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే భార్యగా తనను పిలవకపోవడమేంటని ప్రశ్నించారు. ఆయన ప్రాణాలు తీసిన వాళ్లు వారసులుగా చలామణి అవుతున్నారని మండిపడ్డారు. భార్యగా నాణెం అందుకోడానికి తనకే అర్హత ఉందని స్పష్టం చేశారు.
ఇక నుంచి తన పోరాటం పురందేశ్వరిపైనేనని లక్ష్మీ పార్వతి స్పష్టం చేశారు. తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు కుటుంబ సభ్యులుగా చెలామణీ అవుతారా? అని నిలదీశారు. ఎన్టీఆర్ కొడుకులను అమాయకులుగా పేర్కొన్నారు. కూతుళ్లు పురందేశ్వరి, భువనేశ్వరులే దుర్మార్గులని విమర్శించారు.
పురందేశ్వరి చంద్రబాబుతో కలిసి కుట్ర చేస్తున్నారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఎన్టీఆర్ కష్టాల్లో ఉన్నప్పుడు పురంధరేశ్వరి వచ్చారా ? అని నిలదీశారు. చంద్రబాబు, పురందేశ్వరి, బాలకృష్ణ అందరినీ బయటకు లాగుతానని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల తర్వాత వాళ్లు రాజకీయాల్లో ఉండకుండా చేస్తానని శపథం చేశారు.
కేంద్రం ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తానంటే పురందేశ్వరి అడ్డుకున్నారని లక్ష్మీపార్వతీ ఆరోపించారు. మళ్లీ పురందేశ్వరి, చంద్రబాబు ఏకమైపోయారని విమర్శించారు. పురందేశ్వరి బీజేపీలో ఉంటూ టీడీపీకి పనిచేయడమేంటి? ప్రశ్నించారు. ఆమె టీడీపీ ఏజెంట్ గా పనిచేస్తోందని ఆరోపించారు.
జూనియర్ ఎన్టీఆర్ వస్తే అక్కడ చంద్రబాబుతో కలపాలని ప్రయత్నం చేశారని లక్ష్మీపార్వతి తెలిపారు. చంద్రబాబు స్క్రిప్ట్ పురందేశ్వరి చదువుతున్నారని మండిపడ్డారు. తాను రాసిన లేఖలను సమాధానం రాలేదని అందుకే ప్రధాని, రాష్ట్రపతి, నిర్మలా సీతారామన్ లను కలుస్తానని లక్ష్మీపార్వతి ప్రకటించారు. ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదలకు ప్రైవేట్ కార్యక్రమా? లేక కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమా? అంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్ భార్యనని ప్రతిసారి గుర్తు చేసేలా మెడలో బోర్డు కట్టుకుని తిరగాలా అని నిలదీశారు.