ఏపీలో ఓటర్ల జాబితా పంచాయితీ రోజు రోజుకు చినికి చినికి గాలివానగా మారుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి మొదలైన వివాదం ఏపీ దాటి ఢిల్లీకి చేరింది. సోమవారం కేంద్ర ఎన్నికల కమిషన్ ను టీడీపీ, వైసీపీ నేతలు వేర్వురుగా కలిసి ఫిర్యాదులు చేయనున్నారు. తమ పార్టీ మద్దతుదారుల ఓట్లను వైసీపీ తొలగిస్తోందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఓట్లు గల్లంతు చేసే నీచ రాజకీయం టీడీపీదే అంటూ వైసీపీ ప్రతి దాడి చేస్తోంది. బద్వేల్, తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లతో వైసీపీ గెలిచిందని టీడీపీ ఆరోపణలు చేసింది.
మరో 7 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా వివాదం మరింత ముదిరింది. దాదాపు 60 లక్షలకుపైగా టీడీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు వైసీపీ కుట్ర చేసిందని టీడీపీ నేతలు నేతలు ఆరోపిస్తున్నారు.ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్ ఫిర్యాదుతో తాజాగా ఇద్దరు జిల్లా స్ధాయి అధికారులపై ఈసీ వేటు వేసింది. ఓటర్ల లిస్ట్ లో అవకతవలపై BLOలను ప్రతి మండలానికి పంపి తనిఖీ చేయాలని ఆదేశించింది. చాలా ప్రాంతాల్లో ఒకే ఇంటి అడ్రస్ పై వంద, రెండు వందల ఓట్లు నమోదైన ఘటనలు వెలుగు చూశాయి. చనిపోయిన వ్యక్తుల పేర్లు ఓట్ల జాబితాలో ఉండటంపైనా టీడీపీ అభ్యంతరం చెబుతోంది.
ఓట్ల జాబితాల్లో అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని అనేకసార్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. అందుకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. ఈసీని కలిసేందుకు ఇప్పటికే చంద్రబాబుతోపాటు ముఖ్య నేతల బృందం ఢిల్లీకి చేరింది. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు.
మరోవైపు ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎంపీల బృందం కూడా సీఈసీని కలవబోతోంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు వైసీపీ ఎంపీలు ఈసీతో భేటీకానున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని ప్రైవేట్ సంస్థలతో కలిసి ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడ్డారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ప్రజల డేటాను దగ్గర ఉంచుకుని ఓట్ల గల్లంతు కార్యక్రమాన్ని చేపట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేస్తామని టీడీపీ సవాల్ చేసింది. మరో వైపు టీడీపీ ప్రచారంపై వాస్తవాలను ఈసీ దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ కౌంటర్ ఇచ్చింది.