Neeraj Chopra : నీరజ్ చోప్రా మరోసారి అద్భుతం సృష్టించాడు. ఒలింపిక్స్ లో స్వర్ణంతో మెరిసిన ఈ స్టార్.. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో గోల్డ్ సాధించిన తొలి భారతీయుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
పురుషుల జావెలిన్ త్రో విశ్వ విజేతగా నీరజ్ చోప్రా నిలిచాడు. జావెలిన్ 88.17 మీటర్లు విసిరి పసిడిని కైవసం చేసుకున్నాడు. పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 87.82 మీటర్లు విసిరి రజతం సాధించాడు. చెక్ ప్లేయర్ వద్లెచ్ 86.67 మీటర్లు త్రోతో కాంస్యం అందుకున్నాడు.
ఇప్పటి వరకు ప్రపంచ అథ్లెటిక్స్ చరిత్రలో భారత్కు మూడు పతకాలు మాత్రమే లభించాయి. గతంలో రెండు మెడల్స్ మాత్రమే వచ్చాయి. మహిళల లాంగ్జంప్లో అంజు బాబి జార్జ్ 2005లో కాంస్యం సాధించింది. గతేడాది నీరజ్ చోప్రా రజతం కైవసం చేసుకున్నాడు. తాజాగా స్వర్ణం చేజిక్కించుకుని చరిత్ర సృష్టించాడు.
తొలి ప్రయత్నంలోనే నీరజ్ ఫౌల్ చేశాడు. రెండో త్రోను 88.17 మీటర్ల దూరం విసిరాడు. మూడో ప్రయత్నంలో 86.32 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 84.64 మీటర్లు , ఆ తర్వాత 87.73 మీటర్లు, 83.98 మీటర్లు విసిరాడు. రెండో త్రోనే నీరజ్ అత్యుత్తమ ప్రదర్శన నమోదైంది. మరో ఇద్దరు భారత్ ప్లేయర్ కిశోర్ జెనా 84.77 మీటర్లు విసిరి అయిదో స్థానంలో నిలిచాడు. మను 84.14 మీటర్లు త్రో చేసి ఆరో స్థానంలో ఉన్నాడు.