తిరుమలలో మరో చిరుతను అటవీశాఖ అధికారులు బంధించారు. అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుతను ట్రాప్ చేశారు. దీంతో ఇప్పటి వరకు 4 చిరుతలు చిక్కాయి. తొలుత జూన్ 24న ఓ చిరుతను బంధించారు. ఆ తర్వాత ఆగస్టు 14, 17, 28 తేదీల్లో మిగిలిన మూడు చిరుతలను పట్టుకున్నారు.
నాలుగో చిరుతను బంధించేందుకు వారం రోజులుగా అటవీశాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చిరుత అనేకసార్లు బోను వరకు వచ్చి వెనక్కివెళ్లిపోయింది. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు కనిపించాయి. ఆదివారం రాత్రి మరోసారి బోను వద్ద చిరుత వచ్చింది. లోపలకి వెళ్లి చిక్కుకుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.
నాలుగో చిరుత కూడా చిక్కడంతో ఆపరేషన్ చిరుత విజయవంతమైందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. 2 నెలల కిందట కౌశిక్ అనే బాలుడిపై దాడి చేసిన ప్రాంతంలోనే చిరుత బోనులో చిక్కింది. ఇకపై అలిపిరి నడకమార్గంలో భక్తులు చిరుత భయం లేకుండా వెళ్లొచ్చని అధికారులు చెబుతున్నారు. నాలుగు చిరుతలను బంధించడంతో ఇక నడకమార్గం సురక్షితమేనా? భక్తులు ఏలాంటి భయాలు లేకుండా వెళ్లొచ్చా..?