ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన తర్వాత బీఆర్ఎస్ లో రేగిన ప్రకంపనలు ఆగడంలేదు. పార్టీ అధిష్టానంపై ఇప్పటికే చాలామంది నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. టిక్కెట్ దక్కని కొందరు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో దిగాలని యోచిస్తున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన తర్వాత మానుకొండూర్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు మళ్లీ టిక్కెట్ దక్కింది. దీంతో ప్రభుత్వ మాజీ విప్ ఆరేపల్లి మోహన్ పార్టీ మారే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. మానుకొండూర్ టికెట్ ఇస్తారని ఆశించిన ఆయనకు.. గులాబీబాస్ మొండిచేయి చూపించారు. బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోవడంలేదని అసంతృప్తితో ఉన్న ఆరేపల్లి.. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో రహస్య సమావేశాలు నిర్వహించారు.
ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే గట్టి పట్టుదలతో ఆరేపల్లి మోహన్ ఉన్నారని తెలుస్తోంది. అందుకే తన అనుచరవర్గంతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. బీజేపీ వైపు ఆయన చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కాషాయ కుండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు వ్యతిరేకంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు కూడా ఆరేపల్లికి మద్దతు తెలుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆరేపల్లి పార్టీ మారితే బీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. మరి బీఆర్ఎస్ అధిష్టానం ఆయనతో చర్చలు జరుపుతుందా? నామినేటెడ్ పదవి ఏదైనా ఆఫర్ చేస్తుందా? ఇక పార్టీ మారేందుకు ఆరేపల్లి సిద్ధమయ్యారు? ఈ అంశాలన్నీ మానుకొండూర్ లో హాట్ టాపిక్ గా మారాయి.