Drugs Case : కంచె చేను మేసినట్టు పోలీస్ డిపార్ట్మెంట్లో ఓ ఎస్ఐ ఇంటి దొంగగా మారారు. సీజ్ చేసిన డ్రగ్స్ను మాయం చేసిన కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ విభాగంలో పని చేస్తున్న ఎస్ఐ రాజేందర్ ను అరెస్టు చేశారు. నిందితుల వద్ద పట్టుబడిన దాంట్లో దాదాపు 1,750 గ్రాముల డ్రగ్స్ మాయం చేసి అమ్మేందుకు ఎస్ఐ ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించిన ఉన్నతాధికారుల విచారణలో ఎస్ఐను నిందితుడిగా తేల్చారు.
ఎస్ఐ రాజేందర్ వ్యవహారం తొలి నుంచి వివాదాస్పదంగా ఉంది. హైదరాబాద్ రాయదుర్గంలో ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు. ఆ కేసులో అతన్ని సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే కోర్టు స్టే తెచ్చుకుని మళ్లీ డ్యూటీలో చేరారు ఎస్ఐ రాజేందర్.
ప్రస్తుతం నార్కోటిక్ టీమ్లో ఎస్ఐగా రాజేందర్ విధులు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలో చేసిన ఓ ఆపరేషన్లో ఆయన పాల్గొన్నారు. అక్కడ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే సీజ్ చేసిన డ్రగ్స్ను కోర్టులో డిపాజిట్ చేసే సమయంలో తక్కువగా చూపించారని అధికారులకు అనుమానం కలిగింది. దీంతో ఎస్ఐ రాజేందర్ ఇంట్లో తనిఖీలు చేశారు. ఉన్నతాధికారుల విచారణలో నిజాలు తేలడంతో ఎస్ఐ రాజేందర్ను అరెస్టు చేశారు.