AP News : ఇది ఖతర్నాక్ న్యూస్. అనగనగా ఓ లైన్మెన్. బండి మీద వెళ్తున్నాడు. సడెన్గా పోలీసులు అతని బండిని ఆపేశారు. లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్ చూపించమన్నారు. ఇతనేమో తాను గవర్నమెంట్ ఎంప్లాయ్ అని బిల్డప్ ఇచ్చాడు. విద్యుత్ శాఖలో ఉద్యోగినని వదిలేయమని అడిగాడు. పోలీసులతో ఎంతగా వాగ్వాదం చేసినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. అసలే పోలీసోళ్లు. వేరే డిపార్ట్మెంట్ ఉద్యోగులను లెక్క చేస్తారా? అందుకే, ఇలాంటి పప్పులేవీ ఉడకవంటూ.. సరైన పత్రాలు లేవంటూ ఫైన్ వేసేశారు.
ఆ లైన్మెన్కు ఒళ్లు మండింది. తన బండికే ఫైన్ వేస్తారా? ఉండండి మీ సంగతి చెబుతా? అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎలాగైనా ఆ పోలీసులకు షాక్ ఇవ్వాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు. తన పరిధిలో పోలీస్ హెల్ప్డెస్క్ స్టేషన్ ఉంది. దీంతో, నేరుగా కరెంట్ పోల్ ఎక్కి.. ఆ హెల్ప్ డెస్క్కు పవర్ కట్ చేసి పడేశాడు ఆ లైన్మెన్.
కరెంట్ లేక, ఎంతకీ రాక.. పోలీస్ హెల్ప్ డెస్క్ సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడ్డారు. అసలేమైందని కనుక్కుంటే.. అసలు విషయం ఆ తర్వాత తెలిసింది. ఆ విద్యుత్ శాఖ ఉద్యోగిపై మండిపడుతున్నారు పోలీసులు. పార్వతీపురంలో జరిగిందీ ఘటన.