చేవెళ్లలో కాంగ్రెస్ ప్రజాగర్జన సభ మారుమోగిపోయింది. 12 హామీలతో ఎస్సీ, ఎస్టీ డిక్టరేషన్ ప్రకటించింది. ఏక్ సే ఏక్ ఉన్నాయి ఆ హామీలు. కర్నాటకలో మాదిరే.. తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో ప్రకటించిన 12 హామీలు అమలు చేసి తీరుతామని చెప్పారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో 5 హామీలు ఇచ్చామని, అవి అమలుచేస్తున్నామని.. తెలంగాణలోనూ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతామని చెప్పారు.
కేసీఆర్ సర్కార్ను కూలగొట్టేందుకే అంతా ఇక్కడకు వచ్చారని అన్నారు. యువకుల బలిదానాలు చూడలేక సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని.. అయితే, రాష్ట్రం తెచ్చానంటూ కేసీఆర్ క్రెడిట్ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వచ్చాక సోనియా ఇంటికొచ్చిన కేసీఆర్.. ఆమెతో ఫోటో తీసుకుని బయటకు వచ్చి.. మాట మార్చేశారని తప్పుబట్టారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు ఖర్గే. బీజేపీని కేసీఆర్ బయట తిడతారని.. లోపల మాత్రం మంతనాలు జరుపుతారని విమర్శించారు.
ఇక, 53 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను ఎవరు నిర్మించారు? నాగార్జున సాగర్ ఎవరు కట్టారు? అని ప్రశ్నించారు. భూ సంస్కరణలు అమలు చేసి జమీందారీ వ్యవస్థను నిషేధించామని.. బ్యాంకులను జాతీయరణ చేశామని.. నరేగా చట్టం తీసుకొచ్చామని.. హరిత విప్లం, శ్వేత విప్లవం కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో సెల్ఫోన్ ఉందంటే అందుకు రాజీవ్గాంధీనే కారణమని చెప్పారు ఖర్గే.