Nellore News : నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ పరిధిలోను చిట్టేపల్లి గ్రామంలో ముగ్గురు యువకులకు దొరికిన లంకె బిందెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మే 7న తేనె కోసం గ్రామ సమీపంలోని కొండపై ఉన్న పురాతన అంకమ్మ ఆలయం వద్దకు యువకులు వెళ్లారు. అక్కడ వారికి విలువైన బంగారు నాణేలతో కూడిన లంకెబిందె దొరికింది.
యువకులు కొన్ని నాణేల్ని చెన్నైలో విక్రయించి, సొమ్ము చేసుకున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎట్టకేళకు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. నాణేలు చెన్నైలో విక్రయించినట్టు గుర్తించారు. బిందెను చెరువులో పడవేశారనే సమాచారంతో చెరువు వద్దకు చేరుకుని.. 10 మంది గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా బిందె దొరకలేదు.
మరోవైపు.. చెన్నైలో విక్రయించిన బంగారు నాణేల్ని పోలీసులు రికవరీ చేశారు. 14 లక్షల నగదు, 21 సవర్ల బంగారు నగలు, 436 చిన్న బంగారు నాణేలు, 63 పెద్ద బంగారు నాణేలు, కారు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకొని విచారించారు. గుప్త నిధులు, లంకెబిందెల కోసం ఎవరైనా ప్రయత్నిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు రూరల్ డీఎస్పీ హెచ్చరించారు.